సంక్రాంతికి విడుదల కావాల్సిన 'భీమ్లానాయక్' పోటీ వద్దని ఫిబ్రవరికి వెళ్లాడు. పొంగల్ని 'ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్'కే వదిలేసి పండగ నుంచి తప్పుకున్నాడు పవన్. ఇక ఈ పోస్ట్పోన్తో పాటే ఫిబ్రవరి 25న 'భీమ్లానాయక్' రిలీజ్ అని ప్రకటించారు. అయితే ఒమిక్రాన్ ప్రభావంతో 'ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్' రెండూ వాయిదా పడ్డాయి. ఇప్పుడు 'భీమ్లానాయక్' కూడా వెనక్కి వెళ్లే అవకాశముంది అంటున్నారు. సంక్రాంతి తర్వాత కరోనా కేసులు మరింత పెరిగాయి. మార్చి వరకు థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. దీంతో ఫిబ్రవరి మార్చి అనుకున్న స్టార్లు చాలామంది వెనక్కి వెళ్తున్నారు. పాండమిక్లో సినిమా రిలీజ్ చేసి, నష్టపోవడం కంటే కొన్నాళ్లు ఆగడమే బెటర్ అనుకుంటున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ రోల్స్లో కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా థర్డ్వేవ్ మూలంగా ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది 'ఆచార్య' టీం. ఇక ఈ సినిమా గతేడాది ఏప్రిల్లోనే విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్తో షూటింగ్లకి బ్రేకులు పడి 2022కి వచ్చింది. థర్డ్వేవ్తో వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదలవుతోంది. మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'మేజర్'. ముంబాయి 26/11 ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 11ని లాక్ చేసుకుంది. కానీ దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో థియేటర్లు 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చెయ్యలేమని, ఇండియా మొత్తం నార్మల్ డేస్లోకి వచ్చాకే మేజర్ని విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్.
'రాధేశ్యామ్' రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించింది. కేసులు మరింత పెరిగితే కొన్నాళ్ల పాటు లాక్డౌన్ విధించడం బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ మినిస్టర్స్ కూడా కేసులు పెరిగితే కర్ఫ్యూలు, లాక్డౌన్ల గురించి ఆలోచించే అవకాశముందని చెప్తున్నారు. దీంతో 'రాధేశ్యామ్' కరెక్ట్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' కూడా ఏప్రిల్ 1 నుంచి వాయిదా పడే అవకాశముంది. మహేశ్ బాబు మోకాలి సర్జరీ తర్వాత కరోనా బారిన పడ్డాడు. స్పీడ్గానే రికవరీ అయినా, దేశంలో పరిస్థితులు మారాకే మళ్లీ షూటింగ్ సెట్స్కి వెళ్లాలనుకుంటున్నాడు మహేశ్. సో మార్చిలో మళ్లీ షూటింగ్ మొదలయ్యే చాన్స్ ఉంది. నెల రోజుల్లో బ్యాలెన్స్ షూటింగ్తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చెయ్యడం కొంచెం కష్టమే. ఇక ఈ సినిమా 2022 సెకండాఫ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.
సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. 'సూపర్ మచ్చి, రౌడీబాయ్స్, హీరో' లాంటి సినిమాలు వచ్చాయి. వీటితోపాటు నాగార్జున, నాగచైతన్యల 'బంగార్రాజు' కూడా బరిలో దిగింది. అలాగే సంక్రాంతి నుంచి వెళ్లిపోయిన 'ఆర్ ఆర్ ఆర్' మాత్రమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అది కూడా రెండు డేట్స్ ప్రకటించింది. కరోనా తగ్గితే మార్చి 18 లేకపోతే, ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు.