మళ్లీ మొదటి నుంచి ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ విషయంలో రాజమౌళి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సినిమా షూటింగ్ పూర్తై, విడుదల సమయానికి పబ్లిసిటీ పీక్స్ లో ఉంచాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో భారీగా థియేటర్లు దొరికాలి, హౌస్ ఫుల్ షోస్ నడవాలి. దానికి సరైన సమయం దొరకాలి. ఇటీవల కరోనా ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్య వచ్చిన గ్యాప్ లో కొన్ని సినిమాలు ఇలాగే కాసులు పండించుకున్నాయి. వకీల్ సాబ్ మూవీ హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తున్న సందర్భంలో థియేటర్లు మూత పడటంతో కాస్త రెవెన్యూ తగ్గినమాట వాస్తవం. అలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాతే ఆర్ఆర్ఆర్ మూవీని థియేటర్లలోకి తేవాలనుకుంటున్నారు రాజమౌళి. తర్వాత వచ్చే కొత్త సినిమాల ప్రభావం మొదలయ్యేనాటికి ఆర్ఆర్ఆర్ కు అన్నీ హౌస్ ఫుల్ షోస్ పడితేనే ఫలితం ఉంటుంది. అందుకే పబ్లిసిటీ విషయంలో రాజమౌళి సరికొత్త పంథా ఎంచుకోవాలని చూస్తున్నారు.
బాహుబలి పబ్లిసిటీ విషయంలోనే రాజమౌళి మరో మెట్టు ఎదిగారు. జాతీయ మీడియాతో సినిమాకి మంచి ప్రచారం చేయించారు. పాన్ ఇండియా మూవీగా పేరు తెచ్చారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంతకంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ రావడంకోసం బాలీవుడ్ నటుల్ని కూడా ఏరికోరి తెచ్చుకున్నారు. బాహుబలిలో కేవలం దక్షిణాది నటులకే ప్రాధాన్యం ఇచ్చిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో హిందీ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ కి తెచ్చేశారు. హాలీవుడ్ నటితో.. మరింత అదనపు హంగులద్దారు. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తోపాటు.. ఈ భారీ తారాగణంలో వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తారట. సినిమా విడుదలయ్యే నాటికి ఈ టూర్ పూర్తయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తమ్మీద ఇప్పటి వరకూ జరిగిందంతా పక్కనపెట్టి.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ని మళ్లీ సరికొత్తగా మొదలు పెట్టేందుకు రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోంది.