తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రారాజుగా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఘట్టమనేని కృష్ణ.1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో కృష్ణ జన్మించారు.కృష్ణను ఇంజనీరింగ్ చదివిచాలనే కోరిక ఆయన తల్లిదండ్రులకు ఉండేది.అయితే ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో ఆయన డిగ్రీ పూర్తి చేశారు.డిగ్రీ పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ చదివించాలనే ఆయన తల్లిదండ్రులు పట్టుదలగా ఉన్నారు కానీ ఇంజనీరింగ్లో ఆయనకు సీటు రాలేదు.దీంతో సినిమాల్లో హీరో కావాలని అనుకుంటున్న కృష్ణ.... తన తండ్రి అనుమతి తీసుకుని సినిమాల్లో ప్రయత్నాలు చేశారు.గుంటురు జిల్లా నుంచి అప్పటికే తెలుగు సినిమా రంగంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.వీరందరికి కృష్ణ తండ్రి తన కుమారుడికి అవకాశాలు ఇవ్వాలంటూ లేఖలు రాసేవారు.అప్పటి తెలగు సినిమారంగానికి కేంద్ర బిందువు మద్రాస్.అలా మద్రాసు వెళ్లిన కృష్ణ చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి రమ్మని అక్కడి ప్రముఖులు సలహా ఇచ్చారు.అప్పటి నుంచి కృష్ణ చిన్నచిన్న నాటకాలు వేయాలని నిర్ణయించుకున్నారు.అలా కొన్నాళ్ల పాటు నాటకాల్లో నటించిన కృష్ణ...తిరిగి మళ్లీ మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది.
రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు (1962) సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ (1964) సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీనితో కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయాడు.1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపికచేశాడు. సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. దీనితో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. హీరోగా రెండో సినిమా అయిన కన్నెమనుసుల్లో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు.
తేనెమనసులు సినిమాలో స్కూటర్తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం చూసి, డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన జేమ్స్బాండ్ చిత్రానికి హీరోగా ఎంపికచేశాడు.రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు జూలై 22న విడుదలై యావరేజిగా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది.అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ బిరుదు తెచ్చుకుని తన నటనతో కోట్లమంది అభిమానులును ఆయన సంపాదించుకున్నారు.ఆ నాటి "బుర్రిపాలెం బుల్లోడే" నేటి "సూపర్ స్టార్"గా వెండితెరపై వెలుగువెలుగుతున్నారు.