కూతురు డీఎస్పీ.. తండ్రి సీఐ.. సెల్యూట్ ఫోటోపై చిరంజీవి సూపర్ ట్వీట్

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: తల్లితండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు తమకంటే ఓ మెట్టు పైనే ఉండాలనుకుంటారు. ఆ తండ్రి కూడా అలానే అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సీఐగా పనిచేస్తున్న శ్యాంసుందర్.. తన కెమార్తె జెస్సీ ప్రశాంతిని కష్టపడి చదివించారు. పోలీసును చేశారు. ఆమె కూడా తండ్రి మాటకు కట్టుబడి గొప్పగా చదువుకుని ఆయన కలను నిజం చేశారు ప్రశాంతి. ఏకంగా డీఎస్పీ అయ్యారు. తనకంటే పై ఉద్యోగం సాధించి వచ్చిన కూతురికి తండ్రి శ్యాంసుందర్ గర్వంగా, గౌరవంగా సెల్యూట్ చేశారు. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫోటోను మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. తండ్రీ, కూతుళ్లపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.
మెగాస్టార్ చిరంజీవి సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సెటైర్లు, పంచ్‌లే కాకుండా.. మంచి ఎక్కడున్నా, గొప్ప పని ఎవరు చేసినా ముందుగా ప్రశంసిస్తుంటారు. తనకు తెలిసిన ప్రతి మంచి పనినీ అభిమానులతో పంచుకుంటుంటారు. ఏపీకి చెందిన శ్యాంసుందర్, ప్రశాంతిల విషయం తెలిసి వారి ఫొటోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
అంతేకాదు ఆ ఫోటోకు ‘ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు.. తండ్రి సీఐ శ్యాం సుందర్ గారు.. కూతురు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.. తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ,తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తిని,గర్వాన్ని,ప్రేమని చూసాను. శ్యాం సుందర్ గారు.. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను...మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి’ అంటూ ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.
ఇదిలా ఉంటే చిరంజీవి ఇంతకు ముందు కూడా ఇలాంటి అనేక విషయాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విధి నిర్వహణకు ఎంతో నిబద్ధతతో నిర్వహించే మరికొందరి గురించీ గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ పోస్ట్ మ్యాన్, ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇలాం మరెంతో మందిని అభినందిస్తూ ఆయన మెసేజ్‌లు షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన ప్రతి పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ పోలీసు తండ్రి, కూతుళ్ల ఫొటోలను కూడా చిరంజీవి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: