హైదరాబాద్ విచ్చేసిన ఏక్ నిరంజన్ భామ....

SS Marvels
డేరింగ్ అండ్ డాషింగ్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆమె వచ్చారు. దాని కోసం పదిరోజుల పాటు కంగన భాగ్యనగరంలోనే ఉండనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా కంగనా హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని తెలంగాణ పోలీసులు గోప్యంగా ఉంచారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆమె బాలీవుడ్ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేశారు. సెలబ్రెటీలతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబయిని పీవోకేతో పోల్చడంతో అధికార శివసేన నాయకులు ఆమెపై మండిపడ్డారు. మహారాష్ట్రని అవమానించే వారు ముంబయిలో అడుగుపెట్టొద్దంటూ హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే తనకు భద్రత కల్పించాలంటూ ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన కేంద్రం కంగనాకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. కమెండోల భద్రత నడుమ ముంబయిలో అడుగు పెట్టిన కంగనా రనౌత్ వారం రోజులకే తన స్వస్థలం మనాలికి మకాం మార్చేసింది. ఇప్పుడు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్‌ రావడంతో తెలంగాణ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: