హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీలో వారసత్వ పోరు...వైసీపీలో ఎమ్మెల్యే జోరు..

విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. బొత్సకు తన నియోజకవర్గం చీపురుపల్లితో పాటు ఇతర నియోజకవర్గాలపై కూడా మంచి పట్టు ఉంది. అలా బొత్సకు పట్టున్న స్థానాల్లో నెల్లిమర్ల ఒకటి. ఇక్కడ బొత్స సమీప బంధువు బద్దుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.

బొత్స అండతోనే బద్దుకొండ విజయం సాధించారు. ఈయన 2009లో కాంగ్రెస్ నుంచి అదే స్థానం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో బొత్స కాంగ్రెస్ లో ఉన్నాసరే అప్పలనాయుడు మాత్రం వైసీపీలోకి వచ్చి నెల్లిమర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన సరే నియోజకవర్గంలోనే పని చేసుకుంటూ, ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. అందువల్ల 2019 ఎన్నికల్లో కూడా ఆయన టిక్కెట్ దక్కించుకోవడం, బొత్స కూడా వైసీపీలోకి రావడం కలిసొచ్చాయి. దీంతో ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో సాధ్యమైన వరకు పనులు చేసుకుంటున్నారు. బొత్స అండతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి. అయితే నియోజకవర్గంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నెల్లిమర్ల జ్యూట్ మిల్లు ఏపీలో అతి పెద్దది. ఈ మిల్లు స్థానికుల ఉఫాధికల్పనలో కీలక పాత్ర వహిస్తుంది. కానీ, గత పదేళ్ల చరిత్ర తిరగేస్తే, ఈ మిల్లు ఎప్పుడు కార్మికుల ఆందోళనలతో, లాకౌట్ వార్తలతో సమస్యాత్మకంగానే ఉంది. డెంకాడ మండలంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు, పచ్చకామర్లు వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.

ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ టీడీపీని పతివాడ నారాయణస్వామి నడిపిస్తున్నారు. అయితే ఆయనకు వయసు మీద పడటంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన వారసులు పోటీ పడుతున్నారు. ఇలా వారసత్వ పోరు నడవటంతో టీడీపీ వీక్ అయిపోయింది. టీడీపీ వీక్ అవ్వడమే అప్పలనాయుడుకు ప్లస్ అయింది. కానీ ఇక్కడ టీడీపీ కేడర్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల, ఎప్పుడైనా పుంజుకునే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: