హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ యువ ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ ఫిక్స్...?
తండ్రి గుడివాడ గురనాథరావు వారసత్వాన్ని తీసుకున్న అమరనాథ్ 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. 2007 లో టీడీపీలో చేరిన గుడివాడ..అప్పుడు జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 65 వార్డు కార్పొరేటర్ గా విజయం సాధించారు. అయితే తర్వాత అనూహ్య పరిణామాల మధ్య వైసీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ దూకుడుగా పనిచేస్తున్నారు. మంచి వాక్చాతుర్యంతో ప్రతిపక్షానికి సైతం చెక్ పెడుతున్నారు. ప్రజలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతాయి. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుంది. అయితే అనకాపల్లిలో పలు సమస్యలు కూడా ఉన్నాయి.
చెరకు దిగుబడిని ఆసరాగా చేసుకుని ఏర్పడిన బెల్లం తయారీ పరిశ్రమ ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనోపాధిగా మారింది. దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ గా ప్రసిద్ధి పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్. ఈ మార్కెట్ని మరింత అభివృద్ధి చేయాలసిన అవసరముంది. . త్రాగు నీరు, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్యం ఇక్కడి ప్రధాన సమస్యలు. చింతపల్లి-నర్సీపట్నం-చోడవరం-సబ్బవరం-ఆనందపురంల మధ్య వెళ్లే రాష్ట్ర హైవేను జాతీయ రహదారిగా మార్చాలనే ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక.
అయితే అమరనాథ్ కు సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారు. సీనియర్ నేత దాడి వీరభద్రరావు , అమరనాథ్ని నెగిటివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ గా అమరనాథ్ సరిగా పనిచేయట్లేదని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అటు టీడీపీ విషయానికొస్తే...ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారు. ఈయన ప్రస్తుతం యాక్టివ్ గానే ఉన్నారు. కాకపోతే తన తనయుడు వల్ల గోవింద్కు నెగిటివ్ ఉంది. గత ఐదేళ్లు పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల గోవింద్ కు మొన్న ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఇంకా ఆయన పెద్దగా పుంజుకున్నట్లు లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ అమర్నాథ్ బలంగానే ఉన్నారు. నెక్స్ట్ మంత్రి పదవి కూడా వస్తే తిరుగుండదు.