కృష్ణాష్ఠమి : కృష్ణాష్టమి పండుగ విశిష్టత మీకు తెలుసా... ?
ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 30వ తేదీన జరుపుకుంటున్నాం. వైష్ణవ సాంప్రదాయంలో జన్మాష్టమిని 31న మంగళవారం రోజు జరుపుకుంటారు. స్మార్తులు తిధి ఆధారంగా శ్రీకృష్ణుడు పుట్టిన రోజును జరుపుకుంటారు. వైష్ణవులు మాత్రం నక్షత్రం ఆధారంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజును పరిగణిస్తారు. శ్రీ కృష్ణుడు 8వ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన కంసుడి కారాగారంలో పుట్టాడు. అందుకే ఈ రోజున శ్రీకృష్ణుని భక్తులందరూ స్నానమాచరించి మడి బట్టలు ధరిస్తారు. తమ గృహాలలోని పూజా గదిని శుభ్రం చేసుకుంటారు. ఇంటి గుమ్మాలను మామిడి ఆకులతో అలంకరించి.. గడపను పసుపుకుంకుమతో చక్కగా ముస్తాబు చేస్తారు.
కృష్ణాష్టమి రోజున భక్తులు పగటి పూట ఉపవాసం ఆచరిస్తారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణుడిని పూజించి నైవేద్యం పెడతారు. శ్రావణ మాసంలో పుష్కలంగా దొరికే పండ్ల తో పాటు శ్రీ కృష్ణునికి అత్యంత ఇష్టమైన బెల్లం కలిపిన వెన్న , పెరుగు తదితర ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఊయలలో శ్రీకృష్ణ విగ్రహాల్ని పెట్టి కీర్తనలు పాడతారు.