ఇండియాలో రష్యా వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" ప్రయోగాలకు రంగం సిద్ధం...

SS Marvels
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ భారత్‌లో 100 మందిపై ప్రయోగించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) రష్యన్‌ న్యూస్‌ ఏజెన్సీ స్పుత్నిక్‌కు వెల్లడించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు అనుమతులు మంజూరు చేయడం మరో విశేషం. అయితే.. పరీక్షల నిర్వహణ తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. దేశంలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభానికి ముందే ఈ పరీక్షలు ఉంటాయని రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. మూడో దశ ప్రయోగాల్లో 1400 మంది వాలంటీర్లపై టీకా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌), గమాలెయా సంస్థలు సంయుక్తంగా ‘స్పుత్నిక్‌ వి’ (Sputnik V) వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. కరోనా మహమ్మారికి ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌గా ఇది గుర్తింపు పొందింది. ఆగస్టు 11న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు తొలి డోసు అందించారు. ఈ మేరకు పుతిన్ ఈ టీకాకు సంబంధించిన ప్రకటన చేశారు. ఎంతోమంది  పరిశోధకుల అధ్యయనంలో వారి నిరంతర కృషితో చేసిన ప్రయోగాలు విజయవంతమైన తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌కు రష్యా సంస్థ 100 మిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తుంది. ఈ మేరకు రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ, పంపిణీ ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ప్రారంభం కానున్న ఈ టీకా ప్రయోగాలు విజయవంతం కావాలని అతి త్వరలోనే దేశ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: