షాకింగ్ న్యూస్ : ఆ కణాలు క్షీణించడంతోనే... కరోనా మరణాలు...
కోవిడ్-19పై అధ్యయం చేస్తన్న శాస్త్రవేత్తలకు రోజుకో కొత్త విషయం బోధపడుతోంది. తాజాగా కొవిడ్-19 బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన కొన్ని కణాల క్షీణత కనిపిస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణాల సంఖ్య తగ్గడంతో వ్యాధి రోగి శరీరంలో వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. చైనా సైనిక వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొవిడ్-19 రోగుల్లో సైటోకైన్ ద్రవం ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు చెప్పారు. వాస్తవానికి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకొనేందుకు శరీరం విడుదల చేసే ప్రొటీన్ను సైటోకైన్లు అంటారు.
ఇవి ఆకస్మాత్తుగా రోగి శరీరంలో ఎక్కువగా విడుదలవుతుండటంతో ఇన్ఫ్లమేషన్ స్పందన అధికమవుతోంది. అంటే ఆరోగ్యంగా ఉన్న కణాలపైనా ఇవి దాడులు మొదలుపెడుతాయి. వైద్య పరిభాషలో దీనిని సైటోకైన్ స్ట్రోమ్ అంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మాత్రం శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కరోనా వైరస్ నేరుగా టి-కణాలపై దాడి చేయదని సైటోకైన్లను అధికంగా విడుదల చేయడంతోనే టి కణాలు క్షీణించడం లేదా తగ్గడం జరుగుతోందని వైద్య వేత్తలు గుర్తించారు. ‘కరోనా రోగుల్లో శ్వాస ఇబ్బందుల కన్నా టి-కణాలు, వాటి పనితీరుపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధ్యయన బృందం శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
బాధితుల్లో త్వరగా, వేగంగా టి-కణాల సంఖ్య పెరుగుదలను గుర్తించగలిగితే రోగి ప్రాణాలను నిలిపేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాక కొవిడ్-19 రోగుల్లో వీటి సంఖ్య అసాధారణంగా తక్కువ స్థాయికి పడిపోతుండటం గమనార్హం. దీంతో ఇన్షెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోవడంతో రోగి మరణానికి దారితీస్తోందని చెబుతున్నారు. నోవెల్ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, యూరప్ దేశాలు ఈ మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఈ వైరస్ పుట్టిన చైనా, ప్రభావం ఎక్కువగా ఉన్న ఇటలీ లేదా అమెరికాల్లో.. పురుషులతో పోలిస్తే మహిళలపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది.