కొట్టేద్దాం జాబ్: ఇలా రాస్తే మీకు గ్రూప్1 గ్యారంటీ?
ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్గానే ఉంటుంది. కానీ.. రెండో విడత పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ విధానంలో రాయడం చాలా మందికి సరైన అవగాహన ఉండదు. విచిత్రం ఏంటంటే.. మనం అంతా డిగ్రీ వరకూ అన్ని పరీక్షలు డిస్క్రిప్టివ్ తరహాలోనే రాస్తాం.. కానీ పోటీ పరీక్షలకు వచ్చే వరకూ డిస్క్రిప్టివ్ అంటే అదోదో బ్రహ్మ పదార్ధంలా ఫీల్ అవుతుంటారు. గ్రూప్ వన్లో ప్రతి పేపర్లోనూ 15 వ్యాస రూప ప్రశ్నలకు సమాధానాలు మూడు గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. గరిష్టంగా 100మార్కులు తెచ్చుకున్న వాళ్లకు సర్వీస్ తప్పకుండా వస్తుందని నిపుణులు చెబుతుంటారు.
అయితే. ఈ రాత పరీక్ష విషయం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది జవాబు పత్రాన్ని నీట్ గా ఉంచుకోవాలి. ఎలాంటి మరకలు పడేలా... చేయకూడదు.. పెన్ను ఇంకు మరకలు పడేయడం.. బాగా పేపర్ను నలిపేయడం వంటివి చేయకూడదు. మన పేపర్ దిద్దేవారికి పేపర్ చూడగానే చిరాకు కలగకూడదు. ఇది మొదటి పాయింట్.
ఇక జవాబులు రాసేటప్పుడు మన చేతి రాత బావుండాలి. అయితే అందరి చేతి రాత బావుండాలనేమీ లేదు. కానీ.. కనీసం పేపర్ దిద్దేవాడికి అర్థం కావాలి కదా. రాత బాగోక పోతే.. చిన్న టెక్నిక్ల ద్వారా బాగా కనిపించేలా చేసుకోవచ్చు. పదానికి పదానికి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయడం, అప్ అండ్ డౌన్ గా రాయకుండా ఒకే లైన్లో రాయడం.. మార్జిన్లు కొట్టడం, పేరాలుగా విడదీసి రాయడం వంటి వాటి ద్వారా మనం మంచి ఇంప్రెషన్ కలిగించొచ్చు. మనకు సమాధానాలు తెలిసినా ఇలాంటి టెక్నిక్స్ పాటించకపోతే.. ఒక్కో పేపర్లో కనీసం 10 మార్కుల తేడా వస్తుంది. అదే మన ర్యాంకుని నిర్ణయిస్తుంది.