కరోణ మహమ్మారి కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. చాలామంది కరోణ బారినపడి ఆస్పత్రులలో లక్షలు ఖర్చు పెట్టి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఉద్యోగాలు ఉపాధి కూడా కోల్పోయారు. వీటికి తోడు ధరల పెరుగుదలతో జనాలంతా అస్తవ్యస్తం అవుతున్న తరుణంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. విద్యార్థుల ఫీజులు వారి తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారాయి. ఈ విపత్కర పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లో దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 46 ను విడుదల చేశారు. దీని ప్రకారమే 2020- 21 వ సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, గత సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీజు ఉందో అంతే ఫీజు మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ఎలాంటి ఫీజులను పెంచకూడదు అని ఈ జీవోను తీసుకొచ్చారు. ఆ ఫీజులు కూడ నెలవారీగా మాత్రమే తీసుకోవాలని దీన్ని ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇంత స్పష్టంగా సీఎం చెప్పిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు వారి దోపిడిని మాత్రం ఆపడం లేదని చెప్పవచ్చు. ఆన్లైన్ తరగతులు పేరిట గత ఏడాది ఏ విధంగా అయితే ఫీజులు వసూలు చేశారో, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు భయాన్ని కల్పించి ముక్కుపిండి మరీ వసూలు చేశాయి. దీంతో పేరెంట్స్ అసోసియేషన్ వారు ఆందోళన చేపట్టారు. అయినా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి తమకు నచ్చిన విధంగా ఫీజులు వసూలు చేశాయి. సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కట్ చేయడం, అలా వారి తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేసి ఫీజులు వసూలు చేశాయి.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కరోణ బారినపడి కనీసం ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఫీజుల మోతతో ఎన్నో కుటుంబాలు అప్పులు చేస్తూ తమ పిల్లలకు ఫీజు కడుతున్నారు. అయితే ఈ కార్పొరేట్ పిల్లల దగ్గర మాత్రం పూర్తిగా ఫీజులు వసూలు చేసి, ఆన్లైన్ క్లాసులు చెప్పినటువంటి టీచర్లకు మాత్రం సగం జీతాలు ఇచ్చి ఫీజులు రావడంలేదని సాకులు చూపిస్తున్నాయి. ఇలా కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లతో గత సంవత్సర కాలం నుంచి చాలామంది తల్లిదండ్రులు విసుగు చెందారు. దీంతో వారి యొక్క పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు మాన్పించి ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పవచ్చు.