రాజమండ్రి సెంట్రల్ జైలుకు దేశంలోనే గొప్ప చరిత్ర ఉందా..?! తప్పక తెలుసుకోవాలి
తీహార్ జైలులో నిర్భయపై లైంగిక దాడి కేసులో నలుగురు దోషులు ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాగూర్, పవన్ గుప్తా, వినయ్శర్మలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి శిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష అమలైన నేపథ్యంలో ఇప్పుడు తెలుగునాట పాతతరం వారు రాజమండ్రి జైలును గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తమ చిన్నతనంలో రాజమండ్రి జైలులో ఉరిశిక్షలు అమలు చేసేవారిని ఈ తరం వారితో ముచ్చటిస్తుండటం విశేషం. ఉరిశిక్షలు అమలు చేసిన ప్రముఖ జైళ్లలో రాజమహేంద్రవరం కూడా ఉండటం విశేషం. చాలా ఏళ్లక్రితం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏడు సెంట్రల్ జైళ్లు ఉన్నాయి.
విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు, తెలంగాణలోని వరంగల్, చర్లపల్లి, చంచల్గూడలలో ఉన్నాయి. అయితే రాజమహేంద్రవరంలో మాత్రమే ఉరి శిక్షలు అమలు చేసేవారు. ఇది బ్రిటిష్ వారి పాలన కాలం నుంచి ఇది స్వాతంత్రనంతరం కూడా 1974వరకు కొనసాగడం గమనార్హం. ఇప్పటికి కూడా రాజమహేంద్రవరమే తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్షలను అమలు చేసే అధికారిక జైలు కావడం గమనార్హం. ఇక్కడ ఆధునికమైన ఉరి కంబంను కూడా నిర్మించారు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చివరగా 1976లో నంబి కృష్టప్ప అనే ఖైదీని ఉరి తీశారు.
భార్య, పిల్లల హత్య కేసులో ఆయన నేరస్థుడిగా నిరూపణ కావడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో నంబి కృష్ణను ఉరివేశారు. అయితే తన చివరి కోరికగా లడ్డూను తినిపించడం గమనార్హం. ఈ జైలులో అదే చివరి ఉరితీత. అయితే 1993 మార్చి 8న జరిగిన చిలకలూరి పేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతికి కారకులైన కేసులో నిందితులు గుంటూరుకు చెందిన గంటేల విజయవర్ధనరావు, చలపతిరావులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆఖరి నిమిషంలో 1997 ఏప్రిల్లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ క్షమాభిక్ష ప్రసాదించడంతో ఉరిశిక్ష ఆగిపోయింది.