లిక్కర్‌ స్కామ్‌.. జగన్‌ బాబు చేతికి దొరుకుతారా?

గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ ఫెర్ఫార్మెన్స్, తదనంతర పరిణామాల సంగతి గురించి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఏపీ సీఐడీకి ఓ పని అప్పగించారు చంద్రబాబు. ఇందులో భాగంగా.. ఏపీలో జరిగిన మద్యం అక్రమాలనూ సీఐడీతో విచారణ జరిపిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవును.. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. క్వాలిటీ లేని మద్యం అని ఒకరంటే… ఏమాత్రం పరిచయం లేని బ్రాండ్లు అని మరికొంతమంది కామెంట్ చేశారు. ఇక మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్ లేకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని .. మరీ లోతైన విచారణ అవసరం అనుకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) కి సిఫార్సు చేస్తామని ప్రకటించారు. తాజాగా అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై శ్వేత పత్రం సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో భయంకరమైన లిక్కర్ స్కాం జరిగిందని ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మద్యం విషయంలో శ్వేతపత్రంలో ప్రకటించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దాదాపు రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కూటమి నేతలు ఆరోపించారు.

ప్రధానంగా దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరక్కపోవడానికి కారణం.. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారని.. చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారని అనంతరం లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారని చంద్రబాబు అన్నారు. ఫలితంగా ఏపీ ప్రభుత్వం ఏవి అమ్మితే వాటిని తాగే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖను  ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు పాటిస్తామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: