బంగారం రేట్లు పెరగడం వెనుక చైనా కుట్ర.. ఇంత ప్లాన్ చేసిందా?
ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సామాన్యుడు బంగారాన్ని కొనే పరిస్థితి లేకుండా పోతోంది. రోజూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొద్ది రోజులుగా మరీ పది గ్రాముల బంగారం రూ.70 వేలకు దిగి రావడం లేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ ధరలు పెరుగుతున్నాయని అంతా భావించారు. కానీ దీని వెనుక వేరే కోణం ఉందని ఇప్పుడే అర్థం అవుతోంది.
చైనా బంగారం మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్ ని కొనేస్తోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 27 టన్నులకు పైగా బంగారాన్ని డ్రాగన్ కంట్రీ కొనేసింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా బంగారం దిగుమతులు 6 శాతం మేర పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ రేట్లు పెరగడానికి ఈ పరిణామం కూడా ఓ కారణమని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం చైనా దగ్గర 2262 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
గోల్డ్ నిల్వలను సాధ్యమైనంత వరకు పెంచుకొని తన కరెన్సీ యువాన్ ను అమెరికా డాలర్ కు పోటీ ఇచ్చేలా తయారు చేయాలని చైనా స్కెచ్ గీస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా వద్ద 8133 టన్నులు అంటే సుమారు 81 లక్షల కిలోల బంగారం ఉంది. ఇక గోల్డ్ నిల్వల విషయంలో మన దేశం ర్యాంకు 9. ప్రస్తుతం మన దగ్గర ఎనిమిది లక్షల కిలోల బంగారం ఉంది. అయితే ప్రపంచంలో పుత్తడి అధికంగా ఉన్న దేశాలదే ఆధిపత్యం. దీనికి సాక్ష్యం అమెరికా. అందుకే తాను కూడా బంగారం నిల్వలు పెంచుకొని యువాన్ ను బలోపేతం చేయాలని చైనా భావిస్తోంది.