డైరెక్టుగా మోదీతోనే పెట్టుకుంటున్న రేవంత్‌.. ఏంటీ మొండి ధైర్యం?

సీఎం రేవంత్‌ రెడ్డి మరో సాహసం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏకంగా మోదీ, అమిత్‌ షా లనే నేరుగా టార్గెట్‌ చేస్తున్నారు. ఆ ఇద్దరినీ నేరుగా సవాల్ చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. ఏకంగా ఏకవచనంతో పిలుస్తున్నారు. నా రాష్ట్రానికొచ్చి నన్నే బెదిరిస్తారా అంటూ సవాల్‌ విసురుతున్నారు. రేవంత్ రెడ్డి మాట తీరు చూసి నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా నేరుగా మోదీతో పెట్టుకోవడం ఏంటని విస్తుపోతున్నారు.

ఇప్పటికే రెండు, మూడు కేసుల్లో ఉన్న రేవంత్ రెడ్డి.. ఇలా చేస్తే మోదీ టార్గెట్‌ కావడం ఖాయమని అంటున్నారు. మోదీ, అమిత్‌షా గుజరాత్‌ జట్టును లోక్‌సభ ఎన్నికల్లో డకౌట్‌ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని తెలిసే... భారాస, భాజపా కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు.

తెలంగాణ పౌరుషానికి, గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న లోక్‌సభ పోరులో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఏడాది డిసెంబర్‌ 3న జరిగిన సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని... తెలంగాణకు, గుజరాత్‌ మధ్య జరుగుతున్న ఫైనల్‌లో... మోదీని మట్టికరిపిస్తామని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  

రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే... అమిత్‌షా దిల్లీలో అక్రమ కేసులు పెడుతున్నారన్న రేవంత్‌రెడ్డి బీజేపీకి భయపడేది లేదని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో రేవంత్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ అవినీతి, అక్రమాలను గుర్తించిన ప్రజలు... అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని వెల్లడించారు.

పదేళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్‌... రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. విభజన హామీల్లోని కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఆఆర్‌, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపారని రేవంత్‌ రెడ్డి దుయ్య బట్టారు. మూసీ ప్రక్షాళనకు నిధులివ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: