చంద్రబాబు: వేటాడుతున్న అవిశ్వసనీయత ముద్ర?

అధికారం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేయడం ఆనక వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. 2014లో అమలు కానీ హామీలు 650 వరకు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటివైపు కనీసం కన్నెత్తి చూడలేదు. దీని ప్రభావమే టీడీపీ ఘోర ఓటమికి కారణం అయింది. తాజాగా మళ్లీ ఎన్నికలు సమీపించడంతో మరోసారి మోసానికి చంద్రబాబు తెరలేపారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా  ఆరు గ్యారంటీల మాదిరిగా ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కానీ ఇవి ఆశించిన ప్రచారం ఇవ్వలేదు. పైగా ఇవి జనాల్లో చర్చకు కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు పింఛన్లను రూ.4వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు నెలకు రూ.5వేల జీతాన్ని రూ.10వేలకు పెంచుతానని వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. ఏ ఒక్కరు రుణ వాయిదాని చెల్లించవద్దని చంద్రబాబు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బంగారం తనఖా పెట్టిన రుణాలను కూడా చెల్లించవద్దని తాను అధికారంలోకి రాగానే వాటిని విడిపిస్తానని గొప్పగా చెప్పారు. ఈయన మాటలు నమ్మిన అన్నదాతలు రుణాలు తిరిగి చెల్లించలేదు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో వారంతా అనేక అవస్థలు పడ్డారు.

గతంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ ని చూసి.. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అంతకు మించి సంక్షేమ పథకాలను అందిస్తానని చెబుతున్నారు. మరి వీటన్నింటనీ ప్రజలు గమనించరు అని చంద్రబాబు భావిస్తున్నారేమో అర్థం కావడం లేదు. ఇంకా ఇవే కాకుండా ఆడపిల్ల పుడితే రూ.20వేలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇలా పలు రకాల హామీలను ఆయన విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్ముతారా.. ఓటేస్తారా అంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: