రాజ్యాధికారం.. ఆ మాటే మరిచిన పవన్?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన తీరు సామాన్య జనంతో పాటు ఆయన అభిమానులను సైతం అయోమయానికి గురి చేస్తుంది.  ఎల్లప్పుడు రెడ్లు, కమ్మలే అధికారంలో ఉండాలా.. కాపులకు రాజ్యాధికారం వద్దా అని ప్రశ్నించి కాపులను ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అంతా ఒక తాటిపైకి వచ్చి పవన్ మాట వినే సమయానికి చంద్రబాబుతో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.  వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం తనకు ఇష్టం లేదని అందుకే పొత్తు పెట్టుకున్నాను అని ప్రకటించారు.  దీని వెనుక ఏదో ప్రత్యేక వ్యూహం ఉంటుంది. ఎక్కువ సీట్లు అడిగి.. సీఎం షేరింగ్ అడుగుతారు. తద్వారా తమ కల నెరవేరుతుందని కాపులంతా భావించారు. కానీ ఆయన అపరి పక్వత రాజకీయ విధానం మరోసారి బయటపడింది.

తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా సభలో మాట్లాడుతూ తన నెవరూ ప్రశ్నించ వద్దని చురకలంటించారు. అంతకు ముందు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన ఆయన ఇప్పుడు తన నెవరూ ప్రశ్నించ వద్దని విమర్శించారు. దీంతో పాటు గతంలో అమరావతి దోపిడి రాజ్యం అన్నారు. ఇప్పుడు అమరావతే రాజధాని దీనిని అన్యాయంగా తొక్కేస్తున్నారు అని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ లేని ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని 2018లో  లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీ లతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లారు.

ఇప్పుడు మళ్లీ అదే టీడీపీయే ప్రత్యామ్నాయం అంటున్నారు. మూడో వంతు సీట్లు కావాలని పట్టుబతానని చెప్పి.. సీఎం షేరింగ్ విషయం కూడా ఉంటుందని సూచనాప్రాయంగా చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా చంద్రబాబుని సీఎం చేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అవినీతి లేని రాజకీయ నాయకులకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కానీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు కి మద్దతు తెలిపారు. జగన్ బెయిల్ మీద బయట ఉంటే.. ఇప్పుడు చంద్రబాబు కూడా బెయిల్ మీదే బయట ఉన్నారు కదా. ఇవన్నీ పవన్ యూ టర్న్ రాజకీయాలకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: