మరో సంచలనానికి జగన్ సిద్ధం?
ఇప్పటికే రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తయ్యాయి. భీమిలిలో మొదటి సభ జరిగిఇంది. దాదాపు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వచ్చాయి. తర్వాత దెందులూరులో నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు. ఇక రాప్తాడులో జరిగిన సభకు దాదాపు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది పార్టీ నాయకులు తరలి వచ్చారు. ఇప్పుడు తాజాగా నాలుగోది చివరి సిద్దం సభ మార్చి 3న బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించనున్నారు.
సిద్ధం సభల వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది. టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి మరీ విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వీటికి రూప కల్పన చేశారు. ఈ సభల నిర్వహణకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ రేంజ్ లో టీడీపీ, జనసేన కూటమి బహిరంగ సభలు నిర్వహించలేదు.
రా కదిలిరా, శంఖారావం సభలకు సిద్దం సభకు వచ్చిన విధంగా జనాల్ని సమీకరించలేకపోతున్నారు. అప్పట్లో నారా లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం సభకు మాత్రమే లక్షల్లో జనాల్ని తరలించారు. ఇప్పుడు ఈ నెల 28న జనసేనతో కలిసి తాడేపల్లిగూడెంలో సిద్దం సభకు దీటుగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీంతో తమ సత్తా మళ్లీ చూపించాలని వైసీపీ ఈ సభ తర్వాత నాలుగో సిద్ధం సభకు రెడీ అయింది. వాస్తవంగా వైసీపీ మూడు సభలే నిర్వహించాలి అనుకున్నా.. టీడీపీకి పోటీగా మరోసభను నిర్వహిస్తోంది.