విడిపడి పదేళ్లు.. ఇంకా హైదరాబాద్పైనే కన్ను?
శాశ్వత భవనాల్లో తాత్కాలిక కార్యకలాపాలు అన్న చంద్రబాబు సర్కారు ప్రస్తావన కూడా అమరావతి కొంప ముంచిన మాట వాస్తవం. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఇలా ప్రస్తావనలు చేసింది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం. వాస్తవానికి అవి శాశ్వత భవన నిర్మాణాలు. ఇవేమీ షెడ్లు కాదు. ఈ విషయం అక్కడికి వెళ్లి చూస్తే ఎవరికి అయినా అర్థం అవుతుంది. తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ శాశ్వత నిర్మాణాలకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది.
ఈ లోగా ప్రభుత్వం మారింది. రాజధాని అమరావతి కాస్తా కమ్మరావతి అయిపోయింది. మూడు రాజధానులన్నారు. ఇప్పుడేమో ఆ హైదరాబాద్ నగరాన్నే ఉమ్మడ రాజధానిగా కొనసాగించాలని.. రాజధానిగా విశాఖకు కార్యకలాపాలు తరలి వెళ్లేదాకా.. ఈ కొనసాగింపు ఉండాలని వైసీపీ కొత్త వాదన తీసుకువచ్చింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారాయి.
అయితే హైదరాబాద్ ను వదులుకోవడం ఏపీ నేతలకు ఇష్టం లేదు. సాక్షాత్తూ సీఎం జగన్ సైతం అసెంబ్లీలో హైదరాబాద్ ఆదాయం గురించి ప్రస్తావించారు. మరోవైపు ఏపీ నేతలకు సంబంధించిన ఆస్తులు అన్ని అక్కడే ఉన్నాయి. ఉమ్మడి రాజధాని అయితే ఏపీకి కొన్ని హక్కులుంటాయి. అదే విడిపోతే ఆ హక్కును కోల్పోతాం. పదేళ్లలో మేం రాజధాని కట్టుకోలేకపోయాం. కోర్టుల్లో ఇంకా కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఉమ్మడి రాజధాని ని మరో ఐదేళ్లు పెంచాలని వైవీ సుబ్బారెడ్డి కోరుతున్నారు. ఒక ఐదేళ్లు చంద్రబాబు అమరావతిని రాజధాని అని ప్రకటిస్తే.. మరో ఐదేళ్లు జగన్ విశాఖ అని కాలయాపన చేశారు. ఫలితం ఏపీకి రాజధాని లేకుండా పోయింది.