జగన్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి కూడా?

అసెంబ్లీలో సాధారణంగా పేపర్ల రూపంలో నివేదికలు అందజేస్తూ ఉంటారు. వీటిని సభ్యులందరూ చదివి వీటిపై చర్చ పెడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన చర్చంతా రికార్డ్ అవుతూ  ఉంటుంది. 2014 సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అంశాలపై అసెంబ్లీలో చర్చలు జరిపినా ఇలాంటి విధానమే నడిచేది. కానీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనేది అసెంబ్లీలో ఎప్పుడే పెట్టలేదు.

కానీ 2019లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీ లోపల తెరలు ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విధానానికి  శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో జరిగిన వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.   ఈవిధానాన్ని సీఎం జగన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఇప్పుడు జగన్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తొమ్మిదినరేళ్లు అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి వాటికి మొగ్గు చూపలేదు. సంప్రదాయ పద్ధతిలో పేపర్ల రూపంలో నివేదికలు, డాక్యుమెంట్లు సభ్యులకు అందజేసి చర్చలు కొనసాగించేవారు. అటు చంద్రబాబు అయినా.. ఇటు కేసీఆర్ అయినా మేం చేసేది కరెక్టు అనే భావనలో ఉంటారు.

కానీ ప్రస్తుతం ఆధారాలు లేనిది ఎవరూ నమ్మడం లేదు. అందుకే సీఎం జగన్ పవర్ పాయింట్ ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. తనకు తాను టెక్నాలజీ పితామహుడిగా చెప్పుకునే చంద్రబాబు సైతం ఇలాంటి ప్రయోగం చేయలేకపోయారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మేడిగడ్డ బ్యారేజీ కానీ.. కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలను కానీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారానే వివరించారు. ఇదే ప్రస్తుతం కొత్త మార్పు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: