పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ రేట్లు మోతమోగిపోతాయా?
ఇప్పటికే 5జీ సేవల కోసం ఈ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి ఈ రెండు టెలికం కంపెనీలు మొబైల్ టారిఫ్ లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. 5జీ కి కస్టమర్లు అలవాటు చేయడానికి 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీ కి అలవాటు పడటంతో కంపెనీలు మానిటైజేషన్ పై ఫోకస్ చేశాయని పలువురు పేర్కొంటున్నారు.
ఇప్పటికిప్పుడు 5జీకి ఎక్కువ ఛార్జ్ చేసే ఆలోచన లేదని గత నవంబరులో ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని ఎయిర్ టెల్ మేనేజింగ్ డెరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ ఆదాయాన్ని ప్రస్తుతం రూ.200 నుంచి దాదాపు రూ.250వరకు పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్ టెల్ కు కలిపి ఇప్పటికే 12.5 కోట్లమంది 5జీ యూజర్లు ఉన్నారు.
జియో, ఎయిర్ టెల్, వీఐలు చివరగా 2021 నవంబరులో తమ టారిఫ్ లను 19-25శాతం మేర పెంచాయి. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఛార్జీల పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. బారత దేశ మొబైల్ రంగ ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,46,800 కోట్లు ఉండగా. . ఇది 2025 నాటికి రూ.2,77,300 కోట్లకు, 2026లో రూ.3,07,800 కోట్లకు చేరుతుందని సీఎల్ఎస్ఏ అంచనా వేసింది.