జగన్.. ఇన్నాళ్లూ చోద్యం చూసి.. ఇప్పుడు మొదలుపెట్టారా..?
అయితే.. ఇప్పుడు అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా మొదలైన వికేంద్రీకరణ ఉద్యమం పూర్తిగా వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నదనే చెప్పుకోవచ్చు. టీడీపీ అమరావతి ఉద్యమానికి ఇది దాదాపుగా కౌంటర్ ఉద్యమం అన్నమాట. అయితే.. ఇక్కడ వైసీపీ నేతలు దారుణంగా విఫలం అయ్యారని చెప్పక తప్పదు.. టీడీపీ స్పాన్సర్ చేసిన అమరావతి ఉద్యమం ఎప్పుడో ప్రారంభం అయ్యింది.. ఇటీవల పాదయాత్రతో మరికాస్త ఫోకస్ వచ్చింది. తిరుపతిలో ఓ సభ నిర్వహింపజేసి.. దానికి వైసీపీ తప్ప అన్ని పార్టీల నేతలను తీసుకొచ్చి మద్దతు ఇప్పించుకోవడంలో అమరావతి ఉద్యమం విజయవంతం అయ్యింది.
కానీ.. ఆ స్థాయిలో వికేంద్రీకరణ ఉద్యమానికి వైసీపీ ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి నుంచి వైసీపీ ఈ ఇష్యూను చాలా లైట్ గా తీసుకుంది. కానీ.. ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని కౌంటర్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం వికేంద్రీకరణకు అనుకూలంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో వైసీపీ ఇన్నాళ్లూ ఆలస్యం చేసిందనే చెప్పాలి. తమ వాదం ఏదయినా సరే దాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఇన్నాళ్లూ వైసీపీ విస్మరించింది. ఇప్పటికిప్పుడు అమరావతి ఉద్యమానికి కౌంటర్ ఇవ్వాలని హడావిడిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు అరకొరగానే ఉంటున్నాయి. ఈ విషయంలో ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని.. దాన్ని అమలు చేయడంలో వైసీపీ విఫలమైంది.