మోడీని అడిగే ప్రశ్న.. జగన్ను అడిగితే ఎలా పవన్..?
ఇక్కడ మాత్రం పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్నే ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించాడు. గ్రామాల్లో సమస్యలు తీర్చకుండా నవరత్నమనే ఉంగరం తొడిగితే సరిపోతుందా అని కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖలో జనసేన కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశంలో పవన్ ఈ ప్రశ్నల వర్షం కురిపించారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. సమస్యలపై ఎదురొడ్డి పోరాడాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. 152మంది ఎమ్మెల్యేలను గెలిపించింది.. ఏమీ పనిచేయకుండా ఉండటానికి కాదు కదా అని పవన్ ప్రశ్నించారు.
ఇక్కడ పవన్ ప్రశ్నలను మనం మెచ్చుకోవాలి. నిజమే.. పార్టీలకు మనం ఓటు వేసి గెలిపించేది ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోమని కాదు.. ప్రభుత్వ సౌకర్యాలు పెంచమని.. మరి ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటే కచ్చితంగా నిలదీయాల్సిందే.. కానీ.. కేంద్రంలో మోడీ సర్కారు చేస్తున్నదేంటి.. అదే కదా.. ఏకంగా పెట్టుబడుల ఉపసంహరణ అన్న అందమైన పేరుతో చేస్తున్నది ఇదే కదా. ప్రభుత్వ రంగం సంస్థలను అంగట్లో పెట్టి అమ్మేస్తున్నది మోడీ సర్కారే కదా.
అసలు.. ప్రభుత్వానికి వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సారు ఎక్కడికక్కడ తెగనమ్ముతున్నారు కదా. అంతేనా.. నష్టాల్లో ఉన్న పరిశ్రమల సంగతి సరే.. లాభాల్లో ఉన్న పరిశ్రమలను సైతం అమ్మేస్తామంటున్నారు కదా. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది ఎవరిని.. మోడీనా.. జగన్నా..? మరి జగన్పై విమర్శల వర్షం కురిపిస్తున్న పవన్ కల్యాణ్.. మోడీ సర్కారుపై మాత్రం పెదవి విప్పడేం.. ప్రశ్నించడేం.. నిలదీయడేం.. అంటే మాత్రం సరైన సమాధానాలు వినిపించవు.