రాజీవ్‌ ఖేల్‌ రత్న వద్దు.. మరి మోడీ స్టేడియం ఎందుకో..?

క్రీడలు స్ఫూర్తినిస్తాయి.. వ్యక్తిత్వం పెంపొందిస్తాయి. మానసిక ఉల్లాసాన్నిస్తాయి. ఇక ఈ క్రీడల పోటీలు ఆటగాళ్లకే కాక చూపరులకూ ఉత్సాహాన్నిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలు  జాతిని ఉత్తేజ పరుస్తాయి. అయితే దేనికైనా తగిన ప్రోత్సాహం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. క్రీడల విషయంలోనూ అంతే.. అందుకే ఆటగాళ్ల కోసం అనేక పురస్కారాలు, అవార్డులు ప్రభుత్వం ఇస్తుంది. క్రీడల విషయంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న.


ఇప్పుడు ఈ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం వివాదాస్పదం అవుతోంది. ఈ ఖేల్‌రత్న పేరు మారుస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మారుస్తున్నట్టు మోడీ ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు చేశారు.. దీనికి కారణాలేంటి.. దీనికి కూడా మోడీ జవాబు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నరు మోడీ.


ఈ రాజీవ్ ఖేల్‌ రత్నకు పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గుర్తుగా 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డీలకు ఒక ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం ఇస్తారు. మరి ఉన్నట్టుండి ఈ పేరు మార్చడం ఏంటి.. ఇంతకీ ఈ పేరు మార్చమని ఎవరు విజ్ఞప్తి చేశారు.. చేస్తే రాజీవ్ గాంధీ పేరు పట్ల వారి అభ్యంతరం ఏంటి అన్న అంశాలను మోడీ తన ప్రకటనలో వివరించలేదు.


సరే.. మోడీ నిర్ణయం మంచిదే అనుకుందాం.. అసలు క్రీడా అవార్డుకు ఓ రాజకీయ నాయకుడు పేరు ఎందుకని మోడీ భావించి ఉండొచ్చనుకుందాం.. మంచిదే.. రాజీవ్ ఖేల్ రత్న  బదులు ధ్యాన్‌చంద్ ఖేల్‌ రత్నయో బావుంది.. అయితే మరి గుజరాత్‌లో నిర్మించిన ఓ అంతర్జాతీయ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు ఎందుకు పెట్టారు. మోడీ ఏ ఆటగాడని ఈ పేరు పెట్టారు. రాజీవ్ ఖేల్‌ రత్న పేరు మారుస్తున్నప్పుడు మోడీకి ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదు.. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు.. మరి మోడీ దగ్గర సమాధానం ఉందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: