తీన్మార్‌ మల్లన్నను.. కేసీఆర్ హీరోను చేస్తున్నారా..?

తీన్మార్ మల్లన్నను కేసీఆర్‌ హీరోను చేస్తున్నారా.. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అవునేమో అనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా ద్వారా బలంగా జనంలోకి వెళ్లిన నాయకుడు. ఆయనకు యూత్‌లో ప్రత్యేకించి నిరుద్యోగుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉదయం తీన్మార్ మల్లన్న ఇచ్చే వార్తల విశ్లేషణ లైవ్‌కు లక్ష మంది వరకూ చూస్తారంటే ఆ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం ద్వారా తీన్మార్ మల్లన్న యువతను ఆకట్టుకుంటున్నాడు.


ప్రత్యేకించి సీఎం కేసీఆర్‌ను విమర్శించే విషయంలో తీన్మార్ మల్లన్న అన్ని సరిహద్దులూ దాటుతున్నారు. బాతాల పోశెట్టి అంటూ కేసీఆర్‌ను ఎద్దేవా చేయడం.. కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణను దొరసాని గానూ సంబోధిస్తూ తీన్మార్ మల్లన్న చేసే విశ్లేషణలు క్రమంగా అనేక వర్గాలకూ చేరుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టుండి మల్లన్న కార్యాలయంపై పోలీసులు సోదాలు చేయించడం వివాదాస్పదం అవుతోంది. ఇటీవలే మల్లన్న తన రాజకీయ కార్యాచరణ ప్రకటించారు. 7200 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే తన టీమ్‌ ను కూడా బలపరచుకుంటున్నారు.


ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో కలసి పని చేసేందుకు అనేక మంది యువకులు ముందుకు వస్తున్నారు.   ఇలాంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై సోదాలు చేయించడం ద్వారా మరోసారి తీన్మార్ మల్లన్నను కేసీఆర్ హీరో చేస్తున్నారా అనిపించక మానదు. కచ్చితంగా ఈ దాడుల వ్యవహారంతో తీన్మార్ మల్లన్నకు మరింత ఫాలోయింగ్ రావడం ఖాయం.


అయితే ఈ ప్రభుత్వ దాడులను మల్లన్న ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ప్రభుత్వంతో తలపడటం అంటే అంత సులభం కాదు.. ఆ విషయం తీన్మార్ మల్లన్నకు తెలియనిదీ కాదు.. ప్రభుత్వం తలచుకుంటే తనను ఏమైనా చేయ గలదనీ ఆయనకు తెలుసు. మరి మొండి ధైర్యంతో మల్లన్న ఎంత వరకూ ప్రయాణిస్తారో చూడాలి. మొత్తానికి మరోసారి తీన్మార్ మల్లన్న వార్తల్లోకి వచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: