కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. ఇక ఆ రంగం దూసుకుపోతుందా..?

తెలంగాణలో ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రత్యేకించి వరి విషయంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. గత ఏడాది దేశం మొత్తం ఎఫ్సీఐ సేకరించిన ధాన్యంలో సగం తెలంగాణ నుంచేనని ఆ సంస్థ ప్రకటించడం విశేషం. అయితే పంటలు పండించడమే కాదు.. వాటికి విలువ జోడించడం కూడా అవసరమే. అలా విలువ జోడించకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రగతి పెద్దగా ఉపయోగపడదు.


ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించింది. తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ వివరాలు ఏంటంటే.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిదశలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2024-25 వరకు వెయ్యి ఎకరాల వరకు జోన్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది తెలంగాణ.


తెలంగాణ రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ  కేబినెట్‌ నిర్ణయించింది. ఈ జోన్లలో సౌకర్యాలు కల్పించి అర్హులకు భూమి ఇవ్వాలని తెలంగాణ ఆదేశించింది. మొత్తం మీద ఈ రంగంలో సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలని నిర్ణయించింది. దీని ద్వారా 70 వేల మందికి ప్రత్యక్షంగా , మరో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన యూనిట్లకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. సాగు రంగంలో కూడా  సాంకేతికత పెంచే దిశగా జోన్ విధానం అమలు చేయబోతున్నారు. వివిధ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. జోన్ల చుట్టూ 500 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తిస్తారు. ఈ బఫర్‌ జోన్‌లో జనావాసాలు, నిర్మాణాలు అనుమతించవద్దని కేబినెట్ నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: