షాకింగ్‌ : ఆంధ్రాలోనూ షర్మిల పార్టీ.. పావులు కదుపుతున్న బ్రదర్ అనిల్..?

వైఎస్ షర్మిల.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.. తెలంగాణ పార్టీ పెట్టబోతున్న ఆమె.. ఆరంభంలోనే సంచలనాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు.. ఇందిరాపార్క్ వద్ద ఆమె చేపట్టిన దీక్ష సంచలనంగా మారింది. ఆమెను అరెస్టు చేయడం.. ఆమె జాకెట్ చినగడం.. లోటస్ పాండ్‌లో ఆమె దీక్ష కొనసాగించడం సంచలనం సృష్టించాయి. ఇంకా పార్టీకి పేరు కూడా పెట్టకుండానే షర్మిల పార్టీకి క్రేజ్ వచ్చింది.
ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అదేంటంటే.. షర్మిల ఏపీలో కూడా తన పార్టీని విస్తరించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పావులు కదుపుతున్నారట. ఆయన ఇప్పటికే ఆంధ్రాలోని క్రైస్తవ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు గురువారం  నాటి  నిరాహార దీక్షలో తన అన్న జగన్ కు చెందిన సాక్షి’ మీడియా పై  ఆమె లైవ్‌ జరుగుతుండగానే   చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి.  కవరేజ్ చేసింది చాల్లేమా... ఎలాగూ ‘సాక్షి’ మా కవరేజ్ ఇవ్వదుగా అంటూ షర్మిల కామెంట్ చేశారు.
ఈ ఘటన చిన్నదే అయినా.. దీంతో జగన్, షర్మిల మధ్య విబేధాలు బయటపడినట్టయింది. దీనికి తోడు తూర్పు గోదావరి జిల్లాకు చెంది దళిత క్రైస్తవ నాయకులు ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరింత కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహాసేన అనే సంస్థ నాయకుడు రాజేష్ సరిపెళ్ల తన బృందంతో కలిసి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో భేటీ అయ్యారట. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లోనూ షర్మిల పార్టీ ఏర్పాటుపై చర్చించారట.
మహాసేన నాయకుడు రాజేష్ బ్రదర్ అనిల్ ముందు ఈ ప్రతిపాదన ఉంచారట. దీనికి బ్రదర్ అనిల్ దీనికి కాస్త సమయం కావాలని చెప్పారట. ఈ విషయాన్ని రాజేశ్ వెల్లడించారు. ఈ మహాసేన సంస్థ  2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ఇచ్చింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు యాంటీ అయ్యింది. అలాంటి సంస్థ నాయకుడితో బ్రదర్ అనిల్‌ భేటీ కావడం.. ఏపీలో షర్మిల పార్టీ గురించి చర్చించడం  చర్చనీయాంశాలుగా  మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: