హెరాల్డ్ ఎడిటోరియల్ : గన్నవరం వివాదాన్ని తేల్చేసిన జగన్..సీనియర్లకు షాక్

Vijaya
గన్నవరంలో సాధారణ ఎన్నికలు వచ్చినా లేకపోతే ఉపఎన్నికలు జరిగినా వైసీపీ తరపున పోటీ చేయబోయేది మాత్రం వల్లభనేని వంశీయే అంటు జగన్ స్పష్టంగా చెప్పేశారు. గడచిన కొద్ది నెలలుగా గన్నవరం వైసిపిలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై జగన్ ఫుల్లుగా క్లారిటి ఇచ్చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వంశీ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అప్పటి నుండి వైసీపీకి అనుబంధ సభ్యునిగానే కంటిన్యు అవుతున్నారు.




ఈ విషయంలోనే వంశీకి పార్టీలోని నేతలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. వంశీపై పోటిచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఎంఎల్ఏ పార్టీతో కంటిన్యు అవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కృష్ణాజిల్లాలోని మంత్రులతో పాటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా ఉండటంతో యార్లగడ్డ ఏమి చేయలేకపోయారు. కానీ నియోజకవర్గంలో మాత్రం వంశీని వ్యతిరేకిస్తునే ఉన్నారు. దాంతో జగన్ కల్పించుకుని యార్లగడ్డను పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరికీ మధ్య సయోధ్య చేయటంలో భాగంగానే యార్లగడ్డను జిల్లా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ గా నియమించారు.




వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిందని అందరు అనుకుంటున్న సమయంలోనే మరో నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాలు మొదలయ్యాయి. కొంతకాలం వంశీ-దుట్టా వర్గాల మధ్య వివాదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా యాక్టివ్ అయ్యారు. దాంతో వంశీ Vs దుట్టా+యార్లగడ్డ వర్గాల మధ్య గొడవలు పెరిగిపోయాయి. దాంతో నియోజకవర్గంలోని నేతలు, శ్రేణుల మధ్య గందరగోళం పెరిగిపోయింది. నిజానికి యార్లగడ్డకు ఛైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఇక వంశీ విషయంలో గొడవ చేయరనే అందరు అనుకున్నారు. కానీ ఇటు పదవీ తీసుకుని అటు ఎంఎల్ఏను మళ్ళీ యార్లగడ్డ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.




ఈ నేపధ్యంలోనే జగనన్న విద్యాకానుక పథకం లాంచింగ్ కు జగన్ జిల్లాకు వచ్చారు. పునాదిపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో వంశీ, యార్లగడ్డ కూడా హాజరయ్యారు. దాంతో కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే కూర్చున్న జగన్ ఇద్దరి మధ్య సయోధ్య చేశారు. ఇద్దరు కలిసి పార్టీకోసం పనిచేయాలన్నారు. ఇద్దరితోను షేక్ హ్యాండ్ ఇప్పించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ తరపున పోటి చేయబోయేది వంశీనే అంటు జగన్ స్పష్టంగా ప్రకటించేశారు. జగన్ తాజా ప్రకటనతో అయినా పార్టీలో గందరగోళం తొలగిపోయినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యార్లగడ్డ, దుట్టాలు ఇష్టంలేకపోయినా వంశీయే వైసీపీ క్యాండిడేట్ . మరి జగన్ తాజా డెసిషన్ కారణంగా వీళ్ళిద్దరు ఏమి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: