హెరాల్డ్ ఎడిటోరియల్ : లాక్డౌన్ విషయంలో కేంద్రం నిర్ణయం రైటా..రాంగా..?!
ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. జనవరి 30 ఫస్ట్ కేస్ రిపోర్ట్ అయింది. సరిగ్గా 6నెలల తర్వాత ఇప్పుడు చూసుకుంటే 8లక్షలకు చేరువులో ఉంది. ఇందులో 4లక్షలకు పైగా ఆక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరణాల రేటు గ్లోబల్తో పోల్చుకుంటే తక్కువే అయినా.. కేసుల విషయంలో మాత్రం ప్రపంచంలోనే భారత్ మూడో స్థానానికి చేరుకుంది. రానున్న కాలంలో భారత్లో పరిస్థితులు మరింత భయానకంగా, ఆందోళనకరంగా మారుతాయన్న వాదన వినిపిస్తోంది. ఖచ్చితంగా భవిష్యత్తు ప్రమాదఘంటికలు మోగుతున్నట్టే. లాక్డౌన్ వల్ల కూడా ప్రభుత్వం పెద్దగా ఫలితాలు రాబట్టలేకపోయిదన్న చర్చ జరగుతోంది.
మార్చి 25న లాక్డౌన్ ప్రకటించినప్పుడు కేసులు 606 ఉన్నాయి. ఎన్నో కఠినతరమైన నిబంధనలు విధించారు. అయినా ఏ దశలోనూ కేసులు తగ్గలేదు. ఆ తర్వాత సడలింపులు ఇచ్చిన తర్వాత క్రమంగా ఇప్పుడు 7లక్షలకు పైగా కేసులు పెరిగాయి. ఇది రానున్నర రెండు నెలల కాలంలో ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లేదంటే భారత్ వంటి దేశంలో తలెత్తే సంక్షోభం ఊహించలేనివిధంగా ఉంటుంది. ఇందుకు ముంబై పెద్ద ఉదాహరణ. ఇతర నగరాల్లో స్లమ్లకు కరోనా తాకితే ఆపడం ఎవరి సాధ్యం కావడం లేదు. ఇప్పటికే కరోనా కట్టడిలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ. 21రోజులు ఇంట్లో ఉంటే తగ్గుతుందన్న ప్రభుత్వం.. 70 రోజులైనా కంట్రోల్ చేయలేక పోయిందని ఎద్దేవా చేస్తున్నారు. లాక్డౌన్ ఎగ్జిట్ ప్లాన్ కూడా సరిగ్గా లేదంటూ దుయ్యబడుతున్నారు.
అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ మంచి ఫలితాలనే ఇచ్చిందని చెబుతున్నారు. లాక్డౌన్ అమలు చేయడం వలనే తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవకాశం కలిగిందని అన్నారు. రికవరీల సంఖ్య పెరుగుతుండటాన్ని గుర్తు చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఒకేసారి కేసులు పెరగడం వలన వైద్య సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని చెబుతున్నారు. అంతేకాక వృద్ధులకు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకునేందుకు వీలు చిక్కిందని చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని ఘంటాపథంగా చెబుతున్నారు.