బడి ఫీజులో బయటపడుతున్న లింగవివక్ష!
* అడ్డగోలు వసూళ్లు..
తెలంగాణలో సుమారు 50 అంతర్జాతీయ పాఠశాలలు అసోసియేషన్ కింద నడుస్తుండగా, రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు 52,359 ఉన్నాయి. ఇందులో సర్కార్ స్కూళ్లు 40,818 ఉండగా, ఈ పాఠశాలల్లో 22,38,721మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు11,541 ఉండగా, ఇందులో 26,90,844 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయానికి వస్తే అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు గుంజుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో కిండర్ గార్టెన్ కు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ. 5,76,500, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ. 5,76,500, గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ. 7,60,000 ఫీజుల రూపంలో పిండుతున్నారు. ఇక మన్థన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కిండర్ గార్టెన్ కు రూ.85,000, గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ.98,000, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ.1,11,000, గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ.1,32,000 వసూలు చేస్తున్నారు. బండ్లగూడలోని గ్లెండేల్ అకాడమీలో గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ.1,95,000, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ.2, 50,000, గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ.2,55,000 గుంజుతున్నారు. శాంక్టా మేరియాలో గ్రేడ్ 1 నుంచి 4 వరకు రూ.2,40,000 వసూలు చేస్తుండగా, గ్రేడ్ 5 నుంచి 7 వరకు రూ.2,76,146, గ్రేడ్ 8 నుంచి 9 వరకు రూ.3,14,635, గ్రేడ్ 10 కి రూ.3,39,275 ఫీజులు తీసుకుంటున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ.75,521, గ్రేడ్ 6 నుంచి 10 వరకు రూ.89,562 వసూలు చేస్తుండగా, భారతీయ విద్యాభవన్ లో కిండర్ గార్టెన్ కే రూ. 2,25,000 గుంజుతుండగా,1 తరగతి నుంచి 10 తరగతి వరకు రూ.2,75,000 వసూలు చేస్తున్నారు.
* కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం
కార్పొరేట్ విద్యాసంస్థల లాభార్జనను ప్రభుత్వం నియంత్రించని విధంగా సహాయపడుతుండడంతో అవి రెచ్చిపోతున్నాయి. అంతర్జాతీయ నగరంగా పేరున్న హైదరాబాద్ లో ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు కనిపించడంలేదు. ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా వసతులు కల్పించడంలేదు. దీనిపై ప్రభుత్వం ఏమాత్రం పర్యవేక్షించడంలేదు. ప్రతి ఏటా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫీజులు పెంచక తప్పడంలేదని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ నిస్సిగ్గుగా చెబుతోంది. తెలంగాణలో 80 శాతం ప్రైవేట్ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. కార్పొరేట్, అంతర్జాతీయ పాఠశాలలకు తగినట్టు నాణ్యమైన విద్యను అందించకున్నా ఫీజులు మాత్రం గుంజుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఫీజుల నియంత్రణ కోసం 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 91 తెచ్చింది. దీనిని హైకోర్టు కొట్టివేసింది. అయినా ఫీజులను నియంత్రించాలనే సదుద్దేశంతో మళ్లీ 2010లో జీవో 42 తీసుకొచ్చింది. దీనిపై కూడా ప్రైవేట్ విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ సర్కార్ మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా లింగవివక్ష పెరిగిపోయి, ఆడపిల్లలను ఎదగకుండా చేస్తోంది.