ఏపీ, తెలంగాణ: సాగర్‌, శ్రీశైలంపై తేలని చిక్కుముడి?

ఆంధ్రా, తెలంగాణ మధ్య జల పంచాయతీలు ఇంకా కొలిక్కి రావడం లేదు. నాగార్జున సాగర్‌, శ్రీసైలం డ్యామ్‌ల నిర్వహణపై ఏకాభిప్రాయం రావడం లేదు. తాజాగా తెలంగాణ గైర్హాజరీ మధ్య కృష్ణా నదీ యాజమాన్య జలాశయాల పర్యవేక్షక కమిటీ తన నివేదికను పూర్తి చేసింది. శనివారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఆర్ ఎంసీ సోమవారం మరోమారు భేటీ అయింది. హైదరాబాద్ జలసౌధలో కన్వీనర్ రవికుమార్ పిళ్ళై నేతృత్వంలో సమావేశంలో బోర్డు అధికారులు, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అయితే.. ఈ సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రూల్ కర్వ్స్, జల విద్యుత్ ఉత్పత్తి అంశాలపై చర్చించి సిఫారసుల నివేదికపై సంతకాలు చేసేందుకు ఈ సమావేశం జరిగింది.  అయితే.. నివేదికపై బోర్డు సభ్యులతో పాటు ఏపీ సభ్యులు సంతకాలు చేశారు. కానీ తెలంగాణ నుంచి ఎవరూ రాలేదు. తాము మాత్రం  నివేదికను బోర్డుకు నివేదిస్తామని ఆర్ ఎంసీ తెలిపింది.

ఆర్ ఎంసీ సమావేశంలో నివేదిక పై సంతకం చేశామన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి.. తెలంగాణ కూడా హాజరై ఉంటే బావుండేదన్నారు. తెలంగాణ అధికారులు కూడా వస్తే.. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ విధానాలు కొలిక్కి వచ్చేవని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చేదన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి శాశ్వత ఆర్ ఎంసీ కూడా ఏర్పాటు అయ్యేదన్నారు.

అయితే.. కృష్ణా బోర్డు ఛైర్మన్ కు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్... ఆర్ ఎంసీ నివేదికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ ఎంసీ ముసాయిదా నివేదికలోని అంశాలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్నాయని రజత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. నీరు, జలవిద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్ స్టోరేజీ సహా వరద సమయంలో నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని రజత్ కుమార్ అన్నారు. ఈ నివేదికలోని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని రజత్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో ఈ చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: