మహిళలకు ఆ ఒక్క అవకాశం.. ఇంకెన్నాళ్లు..?
2008 మహిళా రిజర్వేషన్ బిల్లుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె.మహేశ్వరి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసే వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్-NFIW సంస్థ.. తొలి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి 25 ఏళ్లు అయిందని పిటిషన్లో కోర్టుకు తెలిపింది. 2010లోనే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా... లోకసభ రద్దు కావడంతో... అక్కడ చర్చ జరగలేదని నేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ తెలిపింది.
ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా లోకసభలో ప్రవేశ పెట్టలేదని నేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. ఈ నేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ఈ బిల్లుకు ప్రధాన పార్టీలు అన్ని దాదాపు మద్దతు ఇచ్చాయని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. అయినా... ఏకాభిప్రాయం అవసరం అనే సాకుతో నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తున్నారని ప్రశాంత్ భూషన్ వాపోయారు.
ఏదైనా బిల్లును ఆమోదించడానికి ముందు చర్చ అవసరమని... ఒక సభ ఆమోదించిన బిల్లును మరో సభ ఆమోదానికి ఎందుకు తీసుకురావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందని పిటిషనర్ తరపున ప్రశాంత్ భూషన్ వాదించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, బిజెడి, డిఎంకె, అన్నా డిఎంకె, శిరోమణి అకాలీదళ్, ఎన్సిపిలు మద్దతు తెలిపాయన్న ప్రశాంత్ భూషన్.. అనేక బిల్లులు ఎలాంటి చర్చ, సంభాషణలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి.. కానీ... ఈ బిల్లు ఆమోదించడానికి ప్రభుత్వాలు పనికిమాలిన సాకులు చూపుతున్నాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరి కేంద్రం ఏం చెబుతుందో.. ఈ కేసు ఎన్నాళ్లు సాగుతుందో?