సభ్య సమాజానికి ఇదేం సందేశం.. నారా లోకేశ్‌?

తెలుగు దేశం పార్టీ కొన్నిరోజులుగా నాటుసారా అంశంపై పోరాడుతోంది. మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ వరుసగా ఎనిమిదో రోజూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన తెలిపింది. నాటుసారా కారణంగా జరిగిన 42మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించింది. కల్తీ నాటుసారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అని ప్లకార్డులు ప్రదర్శించింది. కల్తీసారా మరణాలు జగన్ రెడ్డి హత్యలేనని టీడీపీ నేతలు నినాదాలు చేశారు.

మద్యపాన నిషేధం అని మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు టీడీపీ నేతలు.. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరే.. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ.. ఆ తర్వాత చేస్తున్న ఓ పనే మరీ అభ్యంతరకరంగా అనిపిస్తోంది. అదేమిటంటే.. నాటు సారా కారణంగా మరణించిన మృతుల ఫోటోలకు నివాళులు అర్పించడం.. సాధారణంగా ఇలాంటి నివాళులు.. ఏదైనా యుద్ధంలోనో.. ప్రజల కోసమో ప్రాణాలు అర్పించిన వారికి అర్పిస్తారు.

పోనీ..ఏదైనా రోడ్డు ప్రమాదంలోనో.. లేక.. విదేశాల్లో మరణించిన వారో అర్పిస్తారు.. అది వారికి గౌరవ సూచకంగా.. కానీ.. ఇక్కడ జరుగుతోంది ఏంటి.. నాటు సారా తాగి మరణించిన వారి ఫోటోలకు దండలు వేసి మరీ నివాళులు అర్పించాలా. అందుకు వారు చేసిన ఘన కార్యం ఏంటి.. నాటు సారా తాగడమేనా.. పెళ్లాం, పిల్లలను పట్టించుకోకుండా.. బాధ్యత లేకుండా.. ఇంటిళ్ల పాదీ వద్దు మొర్రో.. ఆ నాటు సారా తాగకు.. మమల్ని అన్యాయం చేయకు అంటూ మొత్తుకున్నా వినకుండా నాటుసారా తాగి ప్రాణాలు అర్పించనందుకు వారి ఫోటోలకు దండలు వేసి నివాళులు అర్పిస్తున్నారా..?

ఇవీ అర్థం కాని ప్రశ్నలు.. నాటు సారా తాగి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందే.. ఎందుకంటే ఆ పాపంలో వారికి భాగం లేదు.. కానీ తాగి చచ్చిపోయిన వారిని దేశ భక్తులు, అమర జవాన్ల స్థాయిలో ఫోటోలకు దండలు వేసి నివాళులు అర్పించడం అంటే.. సభ్య సమాజానికి ఏం సందేశం అందిస్తున్నట్టు.. నేతలు ఓసారి ఆలోచించుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: