ఎందుకీ ఇబ్బందులు.. మార‌కుంటే క‌ష్ట‌మే!

Thanniru harish
వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం త‌రువాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంద‌ట‌. ఇన్నాళ్లు మా జ‌గ‌న్ ఏది చేసినా క‌రెక్టే అంటూ వెనుకేసుకొచ్చిన ఓ వ‌ర్గం క్యాడ‌ర్‌లో ర‌ఘురామ వ్య‌వ‌హారం త‌రువాత‌ ఇబ్బందులు కొనితెచ్చుకోవ‌టం ఎందుకు.. అబాసుపాలు కావ‌టం ఎందుకు అన్న‌వాద‌న వినిపిస్తుంది. సొంత పార్టీ ఎంపీని మంచిత‌నంతో మార్చుకోవాల్సింది పోయి.. ఆయ‌న‌పై కేసులు పెట్టి చిత్ర‌హింస‌లు పెట్ట‌డం వ‌ల్ల రాష్ట్ర స్థాయిలోనేకాక జాతీయ స్థాయిలో చెడ్డ‌పేరును మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింద‌న్న చ‌ర్చ వైసీపీ శ్రేణుల్లో సాగుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు సీఎం జ‌గ‌న్‌కు ఇలాంటి స‌ల‌హాలు ఇచ్చేవారెవ‌రు అంటూ ప‌లువురు వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ట్రాప్‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తుంద‌ని ప‌లువురు వైసీపీ నేత‌ల వాద‌న‌. చంద్ర‌బాబు ఒక‌వేళ కావాల‌నే ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజును వైసీపీపై పురిగొల్పిన.. వైసీపీ అధిష్టానం స్మూత్‌గా హ్యాడిల్ చేయాల్సింది పోయి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రెచ్చిపోయిన‌ట్లు ఇప్పుడు రెచ్చిపోతే ఎలా అన్న‌వాద‌నసైతం పార్టీ శ్రేణుల నుండి వినిపిస్తుంది. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో కోర్టుల్లో చివాట్లు ప‌డుతున్నాయ‌ని, తాజాగా ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌పై కోర్టు తీర్పు పార్టీకి మరింత చెడ్డ‌పేరు తెచ్చేలా ఉంద‌ని వైసీపీ నేత‌లు మ‌ద‌న‌ప‌డుతున్నార‌ట‌.
గ‌తంలో ఏ ప్ర‌భుత్వాలు చేయ‌ని రీతిలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. కోర్టులు ఇచ్చే తీర్పుల‌తో ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తుంద‌న్న ఆందోళ‌న వైసీపీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. ర‌ఘురామ కృష్ణం రాజు కేసులో అన‌వ‌స‌రంగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్న వాద‌న ఆ పార్టీలో వ్య‌క్త‌మ‌వుతుంది. కేసు పెట్టిన‌ప్ప‌టికీ చిత్ర హింస‌లు పెట్ట‌డం వ‌ల్ల‌, అదీ హైకోర్టు ఆదేశాల‌తో చికిత్స‌లు నిర్వ‌హించిన స‌మ‌యంలో త‌ప్పుడు రిపోర్టు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మ‌రింత అబాసుపాలైన‌ట్ల‌యింద‌ని వైసీపీ శ్రేణులు ఆవేద‌న చెందుతున్నారు. ర‌ఘురామ కేసులో త‌రువాత  ప్ర‌భుత్వ వాద‌న‌లే గెలుస్తాయ‌ని, కానీ ప్ర‌స్తుతం జ‌రిగిన డ్యామేజ్ అంతాఇంతా కాద‌న్న చ‌ర్చ వైసీపీ శ్రేణుల్లో సాగుతుంది. ఇలాంటి ప‌రిస్థితులు మ‌రోసారి పున‌రావృతం కాకుండా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేయాల‌ని, అలాకాకుండా ప్ర‌తిప‌క్షంలో ఉన్నామన్న‌ట్లుగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే ప్ర‌జ‌ల్లో అబాసుపాలు కావ‌టం ఖాయ‌మ‌ని వైసీపీ శ్రేణుల్లో చ‌ర్చ‌సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: