రాష్ట్రపతి వచ్చి ఎల్లో మీడియా చెవిలో బాగానే చెప్పారే... కామెడీకి పరాకాష్ట ఇది..!
రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర ఘటన తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. టీడీపీ ఎంపీలు ముగ్గురూ, ఒక రాజ్యసభ సభ్యుడు తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు మోశారు. సరే! ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాలు.. తమను ప్రజలు పట్టించుకోవడం లేదని భావిస్తే.. ఇక, అంతిమంగా ఉన్న ఒకే ఒక అవకాశంగా రాష్ట్రపతికి విన్నవించుకుంటారు. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
అయితే, రాష్ట్రపతి ఇలా కలిసి విపక్ష నేతలను ఆహ్వానించడం, వారు చెప్పే సమస్యలను వినడం, వారిచ్చే వినపత్రాలు స్వీకరించడం సర్వసాధారణం. అదే సమయంలో `ఓకే చూస్తాను!` అని చెప్పడం కూడా కామన్గా జరిగే ప్రక్రియే. ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే, తాజగా జరిగిన ఘటనలో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓ ఎల్లో మీడియాకు మాత్రం రాష్ట్రపతి ప్రత్యేకంగా చెప్పినట్టుగా ఓ కథనం వచ్చింది. అదేంటంటే.. టీడీపీ ఎంపీలతో రాష్ట్రపతి తన మనసు విప్పి మాట్లాడారట. ఏపీలో ఏం జరుగుతోందో తనకు కూడా తెలుసునని చెప్పారట.
అంతేకాదు, `అంతా నేను చేసుకుంటాను. నాకన్నీ తెలుసు. ఏపీలో ఏం జరుగుతోందో అన్నీ తెలుసుకుంటున్నాను. అయితే, మీరు (టీడీపీ ఎంపీలు) ఈ విషయాలపై పార్లమెంటులోనూ లేవనెత్తి ప్రశ్నలు సంధించండి`` అని హితబోధ చేశారట రాష్ట్రపతి. ఇదీ ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల సారాంశం. చదువుతుంటే ఎంత కామెడీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇలాంటి వాక్యాలు రాసేముందు జనాలు చదివితే నవ్విపోతారన్న స్పృహ కూడా వాళ్లకు లేకుండా రాసినట్టుగా ఉంది.
అంటే టీడీపీ ఎంపీలు రాష్ట్రపతితో మాట్లాడినప్పుడు ఈ ఎల్లో మీడియా వాళ్లు గోడ పక్కనే ఉండి విన్నారా ? అన్న సందేహం రాక మానదు. ఇక ఈ ముగ్గురు ఎంపీలు లోపల ఏం జరిగినా బయట మాత్రం తమకు అనుకూలంగానే చెప్పుకుం టారనడంలో సందేహం లేదు. ఇది నిజమేనా ? నిజంగానే రాష్ట్రపతి అలా వ్యాఖ్యానించారా? అంటే.. మిగిలిన ఏ మీడియాలోను రాలేదు కాబట్టి.. అయితే, గియితే.. రాష్ట్రపతి స్వయంగా వచ్చి ఎల్లో మీడియా చెవిలో జరిగింది చెప్పి ఉంటారని సోషల్ మీడియాలో జనాలు సటైర్లు రువ్వుతున్నారు.