వైసీపీ వర్సెస్‌ టీడీపీ: నామినేషన్లలోనే అదిరే వ్యూహాలు?

Chakravarthi Kalyan
ఈవీఎంలలో తెలుగు అక్షర మాల ప్రకారం అభ్యర్థి పేరులో ఉన్న మొదటి అక్షరం ఆధారంగా వరుస క్రమం నిర్వహిస్తారు. ఈ లెక్కన ఒకే పేరున్న అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి. పేరు ప్రకారం చూస్తే ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.  

దీంతో ఆయా పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న నామినేషన్లు వేయించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ కేఏ పాల్ రూపంలో ఈ ఎత్తుగడను వాడుకొంది. అయినా కానీ ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ సారి కూడా టీడీపీ అదే ప్రయత్నం మరో మారు చేసేందుకు యత్నించగా.. వైసీపీ తిప్పికొట్టి అదే ఫార్ములాను సైకిల్ పై ప్రయోగించింది.

మంగళగిరి సీటు టీడీపీకి ఎంత ప్రతిష్ఠాత్మకమో.. వైసీపీకి కూడా అంతే. అక్కడ నారా లోకేశ్ ని మరోసారి ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్యను బరిలో దింపారు. అయితే టీడీపీ నాయకులు మురుగుడు లావణ్య అనే అదే పేరుగల వేరే అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో పెట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ భీమిలిలో గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా అదే పేరుగల వేరు అభ్యర్థిని బరిలో దింపింది.

అలాగే తూర్పు గోదావరి జిల్లా రాజాం నగరం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరాం కృష్ణ పోటీలో ఉంటే ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ తరఫున ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పి.గన్నవరంలో కూటమి తరఫున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉంటే.. వేట్లపాలెం గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణను నామినేషన్ వేయించారు. కొత్తపేట నుంచి బండారు సత్యనారాయణ ఉంటే.. నవరంగ కాంగ్రెస్ నుంచి బండారు శ్రీనివాసరావు చేత నామినేషన్ వేయించారు. ఇలా పలు చోట్ల వైసీపీ టీడీపీకి కౌంటర్ ఎటాక్ చేస్తూ కూటమి నేతలకు షాక్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: