కేసీఆర్‌పై బురద జల్లేద్దాం.. టైంపాస్‌ చేసేద్దాం?

Chakravarthi Kalyan
కేసీఆర్ మీద బురదజల్లడమే కాంగ్రెస్, బీజేపీ ఎజెండాగా కనిపిస్తోందా..అంతకు మించి ఆ రెండు పార్టీలు ఏమీ గమనించట్లేదా అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పదేళ్లలో తెలంగాణకు చేసిన, కోరిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్దమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరించకుండా తోక ముడిచారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

దౌర్జన్యంతో రాష్ట్రాలు, ప్రాంతీయపార్టీల హక్కులను హరించేలా కాంగ్రెస్, భాజపా పనిచేస్తున్నాయంటున్న బీఆర్ఎస్ నేతలు.. దేశాన్ని, తెలంగాణను ఏ రంగంలో అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్, భాజపాకు ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసినందుకు బీజేపీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలా అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్ నినాదం హస్యాస్పదమని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు.

కోటిమందిని కోటీశ్వరులను చేయడం తరువాత.. ముందు ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. గుడ్లు పీకి గోళీలు ఆడుతాం, తొండలు వదులుతాం, మానవబాంబులం అవుతాం అనడానికి కాంగ్రెస్ సిగ్గుపడాలన్న బీఆర్ఎస్ నేతలు... అంత ఉబలాటంగా ఉంటే ఓ సినిమా తీసుకుని సంతోషపడండని హితవు పలికారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తూ... భాజపాకు గులాం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

కేవలం నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని రేవంత్ ప్రధానిని ఎలా కలుస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. చేతనైతే నిపుణుల సలహాలు తీసుకుని రేవంత్...  కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేసి చూయించాలని, అప్పుడు అభినందిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: