చంద్రబాబు.. కుప్పంలోనూ కష్టమేనా?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కుప్పం నుంచే ఎన్నికల బరిలో దిగబోతున్నారు. అయితే.. టీడీపీ కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చంద్రబాబు తనపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడని... రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.



చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడన్న మంత్రి పెద్దిరెడ్డి... నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని.. కనీసం కుప్పంలో కూడా గెలవలేడని.. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం... కానీ చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.



సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు గతంలో విమర్శించారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. కానీ అదే చంద్రబాబు ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారని గుర్తు చేసిన మంత్రి పెద్దిరెడ్డి.. రెండు రూపాయల కిలో బియ్యం చంద్రబాబే తీసేశారన్నారు.



2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారని.. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. సీఎం జగన్ పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారని.. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసన్న మంత్రి పెద్దిరెడ్డి.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: