జగన్కు.. మోదీ సిగ్నల్ ఇచ్చేశారా?
దేశంలో సార్వత్రిక ఎన్నిలకు ఏప్రిల్ ఆఖరిలో జరగాల్సి ఉండగా ఈ సారి మాత్రం ఎన్నికలు కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో ఊపు మీదున్న బీజేపీ ఇదే ఉత్సాహంతో సార్వత్రికానికి సిద్ధం అవుతుంది. ఈ మేరకు జగన్ కు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎన్నికలు సాధారణం కంటే ముందుగా వచ్చే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
ఈ సందర్భంలో మరో కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్ లో విద్యుత్తు కోతలు ఉంటాయి. దాంతో అంతకుముందే ఫిబ్రవరిలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉంది. గతంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగాయి. ఆ రెండు నెలలు ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతాయి. విద్యుత్తు కోతలు, ఉక్కపోతలు, అధిక ధరలతో జనానికి ఇబ్బందులు తప్పవు. ఆ పరిస్థితుల్లో ప్రజలకు చిర్రెత్తుకొచ్చి అధికార పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా ధరల విషయంలో బీజేపీపై వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం మన రాష్ట్రంలో కూడా పడవచ్చు. పొరుగున ఉన్న తెలంగాణలో 24గంటలు కరెంటు అందుబాటులో ఉంటుంది. గత పదేళ్లుగా అక్కడ అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తానంటోంది. కానీ ఏపీలో అలా కాదు. ఇప్పటికే కరెంట్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. వేసవిలో ఈ ఇబ్బందులు మరింత తీవ్రం అవుతాయి. అందువల్ల పార్టీ నాయకుల్ని అప్రమత్తం చేసి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.