కేజ్రీవాల్ అరెస్టు? దిల్లీ కొత్త ఆప్ సీఎం ఎవరో?
ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హరియాణా, బిహార్ రాష్ట్రాల్లోని వివిధ ఎన్నికల్లో ఆపార్టీ పోటీ చేసింది. గోవాలో గత ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది. దీంతో ఎన్నికల సంఘం ఆప్ ను జాతీయపార్టీగా గుర్తించింది. కానీ ఏడాదిలో పార్టీ ప్రతిష్ఠ ఒక్కసారిగా దిగజారిపోయింది. దిల్లీ మద్యం పాలసీలో చేసిన మార్పులు, అందులో జరిగిన అవినీతిపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. భారీ అవినీతి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించింది. ఇది ఆ పార్టీకి పెద్ద మచ్చగా మారింది.
ఇప్పటికే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అరెస్టు అయ్యారు. ఆయనకు బెయిల్ కూడా రావడం లేదు. ఈ సారి ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఈ కేసు విషయమై ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తమ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
ఆప్ ముఖ్య నేతలు గోపాల్ రాయ్, సౌరవ్ భరద్వాజ్, హతీశీ లతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. అరవింద్ అరెస్టు అయితే తదుపరి సీఎం ఎవరు.. పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరించాలి అని సమాలోచనలు జరిపారు. మనీశ్ సిసోదియా బయట ఉంటే ఆయనే సీఎం అయ్యేవారు. ఇప్పుడు ప్రముఖంగా గోపాల్ రాయ్, స్పీకర్ రాం నివాస్ గోయల్, హతీశీ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీ దెబ్బకి ఆమ్ ఆద్మీ మరో నాయకుడిని వెతుక్కునే పనిలో పడింది.