కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేశాయి. అయితే ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని చెబితే కొంతమంది అధికారులు మాత్రం ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా చిరు వ్యాపారుల పై కూడా కొంత మంది పోలీసులు కఠినంగా వ్యవహరించినట్టు వీడియోలు భయటకు వచ్చాయి. మరోవైపు ఇటీవల ఓ కలెక్టర్ రోడ్డుపై యువకుడి చెంప పగలగొట్టి సస్పెండ్ అయ్యాడు. ఆ ఘటన మరవకముందే యూపీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మాస్క్ లేదన్న కారణంతో యువకుడికి చేతికి, కాళ్లకు పోలీసులు మేకులు దించారు. అతడిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ అమానుష ఘటన బరేలీలోని బరాదరీలో చోటుచేసుకుంది. బాధితుడి తల్లి ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం...మే 25న రాత్రి 10గంటల ప్రాంతంలో తన కుమారుడితో పాటు తల్లి కూడా ఇంటిముందు కూర్చుంది. అక్కడకు చేరుకున్న ముగ్గురు పోలీసులు భయట ఎందుకు కూర్చున్నారని నిలదీశారని తెలిపింది.
మాస్క్ ధరిచకుండా ఎందుకు భయటకు వచ్చారిని ప్రశ్నించడంతో కుమారుడికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపింది. దాంతో పోలీసులు తన కుమారుడిని తమతో పాటు తీసుకెళ్లారని....స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడిగితే తన కొడుకును అరెస్ట్ చేస్తామని బెదిరించారని చెప్పింది. మరుసటి రోజు ఉదయం తన కుమారుడు దయనీయ స్థితిలో ఇంటి వచ్చాడని ఆరోపించింది. కాళ్లకు చేతులకు మేకులు కొట్టారని పోలీస్ ఉన్నతాధికారుల ముందు వాపోయింది. ఈ విషయం పై యువకుడి తల్లి బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ రోహిత్ సజ్వాన్ ఆయువకుడిపై చాలా కేసులు ఉన్నాయని...ఆ కేసుల నుండి తప్పించుకునేందుకే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.