వంటా వార్పు: అదిరిపోయే `రొయ్య‌ల బిర్యానీ` ఇలా త‌యారు చేసుకోండి..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి బియ్యం- ఒక కేజీ
రొయ్యలు- కేజీన్నర
నూనె‌- ఐదు టేబుల్ స్పూన్లు
వేగించిన ఉల్లి ముక్కలు- ఒక క‌ప్పు

 

జీడిపప్పు- కొద్దిగా
బిర్యానీ ఆకులు- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి త‌గినంత‌

 

గరంమసాలా- ఒక టీ స్పూన్‌
పెరుగు- అర క‌ప్పు
నిమ్మరసం- ఒక‌టి
కారం- ఒక టీ స్పూన్‌

 

నెయ్యి- మూడు టీ స్పూన్లు
ధనియాల పొడి- అర టీ స్పూన్‌
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు‌
పుదీనా తరుగు- ఒక క‌ప్పు 

 

తయారీ విధానం: ముందుగా రొయ్య‌ల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, కొద్దిగా నూనె వేసి కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. 

 

మ‌రోవైపు బాస్మ‌తి బియ్యాన్ని క‌డిగి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. ఆ త‌ర్వాత మ‌రో గెన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. 

 

ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద పావు గంట‌ పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి. ఇర‌వై నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంటే నోరూరించే రొయ్య‌ల బిర్యానీ రెడీ అయిన‌ట్లే. దీన్ని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: