ఏప్రిల్ ఒకటి.. ఆర్థిక సంవత్సరానికి మొదటి రోజు.. జనవరి ఒకటి క్యాలండర్లో తొలి రోజు అయితే.. ఆర్థిక లావాదేవీలకు ఏప్రిల్ ఒకటే మొదటి రోజు. ఈ రోజు నుంచే ఆర్థిక సంవ్థలన్నీ మొదటిరోజుగా పరిగణిస్తారు. అందుకే ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్సియల్ ఇయర్ అంటారు.
అలాంటి మొదటి రోజే.. స్టాక్ మార్కెట్ జోరుగా సాగింది. ఆరంభం అదిరిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త పుంతలు తొక్కాయి. మొదటిసారి సెన్సెక్స్ 39000 మార్కు తాకింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సుమారు 400 పాయింట్ల మేర పెరిగి 39,115 పాయింట్ల వద్ద కొత్తరికార్డు నమోదుచేసింది.
మార్చి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి, అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. లోహ, వాహన, ఇంధన, మౌలిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 199 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్ల మేర పెరిగాయి.
ఐతే.. ఆ జోరును నిలుపుకోలేదనుకోండి.. అమ్మకాల ఒత్తిడి కారణంగా 199 పాయింట్ల లాభం మాత్రమే నమోదు చేసింది. నిఫ్టీ 50 కూడా ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి వెళ్లి తిరిగొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక రేట్లను పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాలు దీన్ని ప్రభావితం చేశాయి.