ఫైనాన్షియల్ గా సేఫ్.. మోదీ క్లారిటీ
ఆత్మనిర్భర్ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామిక వేత్తలకు మోదీ పిలుపునిచ్చారు. పరిశ్రమలు అనేవి కొత్త అవకాశాలు సృష్టిస్తాయన్నారు. పరిశ్రమలు, సంస్థలు అనేవి దేశాభివృద్ధిలో ప్రధాన భాగమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అదే సమయంలో ప్రతిపక్షాలపై కూడా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దినట్లు చెప్పారు ప్రధాని. రెట్రోస్పెక్టివ్... పాత తేదీల నుంచి వేసే పన్ను విధానంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెట్రోస్పెక్టివ్ పన్ను రద్దు ద్వారా... తమ ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు నమ్మకం ఏర్పడిందని మోదీ వెల్లడించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమల పాత్ర మరువలేనిదన్నారు ప్రధాని. పారిశ్రామిక వేత్తల సహకారంతోనే మరోసారి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోదని హర్షం వ్యక్తం చేశారు. గతంలో పోలిస్తే... ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందన్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం కేవలం 3-4 యూనికార్న్ కంపెనీలు మాత్రమే ఉన్నాయని... కానీ ఇప్పుడా సంఖ్య 60 దాటేసిందన్నారు. వీటిల్లో 21 కంపెనీలు కేవలం కొన్ని నెలల్లోనే ఆవిర్భవించాయన్నారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే... దేశంలోకి ఎఫ్.డీ.ఐ.లు రికార్డుస్థాయిలో వస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్.పీ.ఐ.లు, ఫారెక్స్ నిల్వల విషయంలోనూ ఆల్ టైమ్ రికార్డు సాధించామన్నారు మోదీ. దేశ ప్రజలంతా కూడా మేడిన్ ఇండియా వస్తువులే కొంటున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ వర్గాలకు తమ అండ ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టి కొత్త ఉద్యోగాలు సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.