ఇకనుంచి రిలయన్స్ 'ఫాస్ట్ఫుడ్స్'
అన్నీ అయిపోయాయి ఇంకేం మిగల్లేదు అనుకుంటున్న తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీ ఫాస్ట్ ఫుడ్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. అంటే మనం రిలయన్స్ నూడుల్స్, రిలయన్స్ ఫ్రైడ్రైస్, ఎగ్ ఫ్రైడ్రైస్.. ఇలా ఏమైనా తినొచ్చన్నమాట. ఫాస్ట్ఫుడ్ ఇండస్ట్రీలో భారీ పెట్టబడులు పెట్టడానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంసిద్ధులవుతున్నారు. దీనిలో భాగంగా సబ్వేను కొనుగోలు చేయడానికి సమాయత్తమవుతున్నారు. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ కంపెనీ అయిన సబ్వే త్వరలో రిలయన్స్ సబ్వేగా మారబోతోంది. ఇప్పుడు ఈ వార్త దేశీయ వాణిజ్యరంగంలో సంచలనం సృష్టిస్తోంది. రూ.1860 కోట్లకు త్వరలోనే ఒప్పందం కుదరబోతున్నట్లు సమాచారం.
శాండ్విచ్లో నైపుణ్యం.. సబ్వే
శాండ్విచ్లో నైపుణ్యం కలిగిన అమెరికాకు చెందిన ఫుడ్ ఇండస్ట్రీ దిగ్గజం సబ్వే. ప్రాంతీయంగా మాస్టర్ ఫ్రాంచైజీలద్వారా తన వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది. సబ్వే ప్రాంఛైజీ కార్యకలాపాలను కొనుగోలు చేస్తే దేశవ్యాప్తంగా 600 స్టోర్లను ఏర్పాటు చేయాలనే యోచనలో కంపెనీ ఉంది. మాస్టర్ ఫ్రాంచైజీ నుంచి సబ్ ఫ్రాంచైజీల నిర్వహణద్వారా తన వ్యాపారాన్ని సబ్వే కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అన్నిరంగాల్లో వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తోన్న రిలయన్స్ త్వరలోనే మరిన్ని రంగాలకు కూడా విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరించనున్న రిలయన్స్
ప్రస్తుతం పెట్రో కెమికల్స్, జియో రియలన్స్ ఇండస్ట్రీ ప్రధాన ఆదాయవనరుగా ఉంది. కరోనా సమయంలో కూడా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని జియో కంపెనీని లక్షకోట్లరూపాయలకు పైగా విలువ కలిగిన సంస్థగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించబోతున్నారు. అందులో భాగమే సబ్వే కొనుగోలు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలయన్స్ మార్ట్, రియలన్స్ రిటైల్, రిలయన్స్ ట్రెండ్స్.. అంటూ స్టోర్లను ఏర్పాటు చేసిన కంపెనీ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో 600కు పైగా స్టోర్లను ఏర్పాటు చేయబోతోంది. భవిష్యత్తులో వీటి సంఖ్యను ఇంకా పెంచబోతున్నారు. ప్యాకింగ్ ఫుడ్ రంగంలోకి కూడా రిలయన్స్ త్వరలోనే రాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.