తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ రంగానికి మరింత వన్నె తెచ్చిందని..సమీప భవిష్యత్లో హైదరాబాద్ నగరం గొప్ప ప్రగతిని సాధిస్తుందనీ, ఈ విషయానికి సంబంధించి తనకు ఎలాంటి సందేహాలు లేవని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 26వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆవిష్కరణల రంగంలో భారతదేశం తన ముద్రవేసుకునేందుకు ముందుకు సాగుతున్న క్రమంలో టీహబ్ గొప్ప అంకురార్పణ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు.నగరంలోని ఐటీ కంపెనీలు, ఉద్యోగులు అంతా కలిసి కట్టుగా హైదరాబాద్ను గర్వకారణంగా నిలుపుతున్నారు. హైదరాబాద్ ఐటీ రంగ హబ్గా నిలిచింది.
ప్రొడక్ట్ హబ్, స్టార్టప్ హబ్గా ఎదిగింది. టీహబ్ను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దడం గొప్ప చొరవ. కొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయం. 2020 నాటికి లక్షా 20వేల కోట్ల ఎగుమతులు సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి తగినట్లుగా మీరు కృషిచేస్తున్నారు. ఇన్నోవేషన్పై దృష్టి పెట్టడంతో పాటు, ఐపీ ప్రొటోకాల్ను ఏర్పాటు చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తికి నిదర్శనం అని కితాబు ఇచ్చారు.
నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోకపోతే భవిష్యత్తులో మనుగడ అసాధ్యమన్నారు. గురువును గౌరవించడం మన సంస్కృతిలో ఒక భాగమని, దీంతోపాటుగా తల్లి, స్వగ్రామం, మాతృభాష, మాతృదేశం, గురువును మరిచిపోవద్దని ఆయన కోరారు.