తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం తాజా టెండర్లతో పౌరసరఫరాల శాఖకు 1,110.51 కోట్ల రూపాయల లాభం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది అకాల వర్షాల ప్రభావంతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు 1000 కోట్ల రూపాయలు పైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఈ సర్కారు పేర్కొంది. 1 మెట్రిక్ టన్నుకు 3 వేల రూపాయలు పైగా తక్కువకు టెండర్ కొటేషన్ కట్టబెట్టినా కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదని తెలిపింది.
రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసింది. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు 3 వేలు రూపాయలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు 1,110.51 కోట్ల రూపాయలు అదనంగా సమకూరనుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.