టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందంటున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏఆర్ / సివిల్తోపాటు శిక్షణకు పిలవకపోవడం వల్ల మూడు సంవత్సరాలు శ్రమించి అప్పులపాలై టీఎస్ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆక్షేపించారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికైతే, ప్రభుత్వం కేవలం సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తోందని కానీ టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వట్లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇది వివక్ష చూపడమేనంటూ తీవ్రంగా తప్పుపట్టారు. టీఎస్పీకి ఎంపికైన కానిస్టేబుళ్లు రెండు సంవత్సరాలు తమ సర్వీసు కోల్పోతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. ఈ నష్టానికి ముమ్మాటికి ప్రభుత్వానిదేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్ధులకు ట్రైనింగ్ ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.