బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పురపాలకాల్లో అవిశ్వాసాలపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్ను సీజే ధర్మాసనం కొట్టేసింది. అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్లు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్కు చెందిన పలు పురపాలక సంఘాలకు చెందిన ఛైర్మన్లు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జోక్యం చేసుకోలేదు. దీంతో ధర్మాసనంలో అప్పీల్ చేశారు. సీజే జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లు విచారించింది. మున్సిపల్ చట్టం-2019 లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి తగిన విధానం లేదని పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా స్పష్టత లేదన్నారు. నాలుగేళ్ల తర్వాత కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చని పురపాలక చట్టం చెబుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది.